ఈయన పేరు కిశోర్కుమార్. స్వస్థలం అనకాపల్లి. దక్షిణ మధ్య రైల్వేలో ఎలక్ట్రికల్ ఇంజినీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. వారానికి ఆరు రోజులు విధి నిర్వహణలో తీరిక లేకుండా ఉండే కిశోర్... ఆదివారం వచ్చిందంటే చాలు ఏదో ఒక ఆశ్రమంలో సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. తెలుగు రాష్ట్రాల్లోని అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, దివ్యాంగుల కేంద్రాల్లో కిశోర్ పేరు తెలియదంటే అతియోశక్తి కాదేమో. అంతలా వాటితో అనుబంధాన్ని పెంచుకున్న కిశోర్ కుమార్ మూడేళ్లుగా ప్రతి ఆదివారం వృద్ధులు, వికలాంగులు, అనాథల ఆకలి తీరుస్తూ వారి కడుపు నింపడంలోనే ఆనందాన్ని వెతుకుతున్నారు.
చిన్నప్పటి నుంచే సమాజ సేవ
కిశోర్కుమార్ పాఠశాల స్థాయి నుంచే సామాజిక సేవలో పాలు పంచుకుంటూ వచ్చారు. 1994లోనే మదర్థెరిసా వెల్ఫేర్ అసోసియేషన్, సూపర్ కిడ్స్ డ్యాన్స్ అండ్ కరాటే అసోసియేషన్లు స్థాపించి విశాఖ, అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల పిల్లలు, అనాథలకు అండగా నిలిచేవాడు. తండ్రి ఇచ్చిన డబ్బులను పోగు చేసి పిల్లలకు పుస్తకాలు, బట్టలు కొనిచ్చేవారు. కరాటే, డ్యాన్స్, స్విమ్మింగ్, స్కేటింగ్ నేర్పించగా... వచ్చే డబ్బును కూడా సేవా కార్యక్రమాలకు వెచ్చించేవారు. ఇలా పాతికేళ్ల వయసు వచ్చే వరకూ సామాజిక సేవలో కొనసాగుతూ వచ్చిని కిశోర్... రైల్వేలో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా తన అభిరుచిని మార్చుకోలేదు. ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తూనే ప్రతి ఆదివారం ఏదో ఓ ఆశ్రమంలో అభాగ్యుల ఆకలి తీరుస్తూ కనిపిస్తారు.
అభాగ్యులకు వైద్య సాయం కూడా...
ఆశ్రమాల్లో తలదాచుకుంటోన్న అభాగ్యులకు ఆహారం, నిత్యావసర వస్తువులు అందించే కిశోర్... అంగవైకల్యంతో పుట్టారని రోడ్డున పడేసే ఎంతో మంది పసికందులను అక్కున చేర్చుకొని ఆశ్రమాల్లో చేరుస్తుంటారు. స్వయంగా వెళ్లి వారికి కావలసిన సామగ్రి అందిస్తుంటారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వారికి కావలసిన వైద్య సదుపాయాలు సైతం అందిస్తున్నారు. అయితే ఇందుకు ఎవరి వద్దా ఒక్క రూపాయి కూడా విరాళంగా తీసుకోరు. తన వేతనంతో పాటు డ్యాన్స్, కరాటే నేర్పించగా వచ్చిన డబ్బులనే వినియోగించడం విశేషం.
గవర్నర్ అభినందన
కిశోర్కుమార్ చేస్తోన్న సేవలను తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ నరసింహాన్ స్వయంగా రాజ్భవన్కు ఆహ్వానించి అభినందించారు. రైల్వే ఉన్నతాధికారులూ ప్రత్యేకంగా సన్మానించారు. వివిధ ఆశ్రమాల్లో నిరాశ్రయులు సైతం కిశోర్ను ఎంతో అభిమానిస్తుంటారు.
ఇప్పటి వరకు పాతిక వేల మందికిపైగా అభాగ్యుల ఆకలి తీర్చిన కిశోర్కుమార్... తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఒడిశా, తమిళనాడు, కేరళలోనూ అన్నార్థులను ఆదుకోవడమే లక్ష్యంగా తన సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. పక్కవారు ఏమైపోతే మాకేంటి... తాము బాగుంటే చాలు అనుకునే మనుషులున్న ఈ రోజుల్లో కిశోర్కుమార్ లాంటి వ్యక్తులు నిజంగా అరుదు. ఈ రైల్వే ఉద్యోగి చేస్తోన్న సేవలు ఎందరికో ఆదర్శనీయం.
ఇదీ చూడండి : ప్రకృతి శోభ సంతరించుకున్న జలపాతం