గ్రేటర్ పరిధిలో తాగునీటి సరఫరా సమస్యల పరిష్కారానికి జలమండలి కసరత్తు చేస్తోంది. ఈనెల 18 నాటికి దాదాపు 500 మంది నల్లాదారులు తమ క్యాన్ నెంబర్లను ఆధార్తో లింకు చేశారు. మార్చి 31లోపు ఆధార్ అనుసంధానంతో పాటు ఈ స్కీంలోకి వచ్చే ప్రతి నల్లాదారులు నీటి మీటర్లు అమర్చుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నెంబరు అనుసంధానం కోసం జలమండలి వెబ్సైట్లోకి వెళ్లి నమోదు చేసుకునే వీలు కల్పించారు. అదేవిధంగా ఈసేవా కేంద్రాల్లోనూ ఈ సౌలభ్యం ఉంది. ఎవరి పేరుతో నల్లా కనెక్షన్ ఉందో.. వారి ఆధార్ నంబరు మాత్రమే అనుసంధానం చేయాలి. చాలా మందికి ఆధార్ కార్డు, నల్లా బిల్లులో పేర్లు వేరుగా ఉన్నాయి. కొందరి ఆధార్ కార్డులో ఇంటి పేరుంటే.. నల్లా బిల్లుపై కేవలం పేరుతో మాత్రమే ఉంది. అందువల్ల అనుసంధానం కావడం లేదు.
అపార్టుమెంట్లకు ఇలా..
వ్యక్తిగత గృహాల వరకు ఇంటి యజమాని ఆధార్కు అనుసంధానం చేస్తున్నారు. అపార్ట్మెంట్లకు వచ్చే సరికి చాలా నల్లాలు అసోసియేషన్ పేరుతో ఉన్నాయి. ఇలాంటి అపార్ట్మెంట్లలో ఎవరైనా ఒక్క ఫ్లాట్ యజమాని ఆధార్ ఇస్తే సరిపోతుందని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఫ్లాట్ల యజమానులంతా ఏకీభవిస్తున్నట్లు జలమండలికి తమ అంగీకారం తెలపాలి. ప్రస్తుతం ప్రతి అపార్ట్మెంట్కు జలమండలి బల్క్గా నీటిని సరఫరా చేస్తోంది. ఇక నుంచి ఫ్లాట్ వారీగా విభజించి కుటుంబానికి 20 వేల లీటర్ల వరకు అందుతున్నాయో లేదో చూస్తారు. గ్రేటర్ వ్యాప్తంగా 24 వేల పైనే అపార్ట్మెంట్లు ఉన్నాయి.
ఇదీ చూడండి: ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో రాష్ట్రానికి 4వ ర్యాంకు