దేశంలో తొలిసారి కరోనా(COVID) తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల(post covid problems) చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రిని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ(AIG) హాస్పిటల్స్ ప్రారంభించింది. వర్చువల్గా జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్ రావు, ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని... ప్రారంభించారు. దేశంలో 5 కోట్ల మంది కరోనా(CORONA) బారిన పడితే దాదాపు 2 కోట్ల మంది కరోనా తర్వాతి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అన్నారు.
ఆన్లైన్ సర్వే
ఏఐజీ ఆస్పత్రి తరఫున పోస్ట్ కొవిడ్ సమస్యలపై 5000 మందితో ఆన్లైన్ సర్వే నిర్వహించగా.. కరోనా తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలపై సంచలన నిజాలు తెలిశాయన్నారు డాక్టర్ నాగేశ్వరరెడ్డి. కరోనా తగ్గిన నాలుగు వారాల తర్వాత లక్షణాలు కనిపిస్తే పోస్ట్ కొవిడ్ సిండ్రోమ్ అంటామని.. ఎక్కువ మందికి ఈ లక్షణాలు వచ్చినట్లు సర్వేలో వెల్లడైందని చెప్పారు. కొవిడ్ తర్వాత వచ్చే లక్షణాలు, ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా సరైన సమాచారం, ఆధారాలు లేనందున ఈ సర్వే చేసి ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు వివరించారు.
సంతోషకరం
వైరస్ నుంచి కోలుకున్న వారిలో బలహీనత, నిద్రపట్టకపోవడం సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైందని అన్నారు. చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో 53 శాతం మందికి పోస్ట్ కొవిడ్ సమస్యలు వచ్చినట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు దేశంలోనే ప్రత్యేక ఆస్పత్రిని ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలంగాణ సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు అన్నారు.
ఇదీ చదవండి: DH: 'రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేషన్... వైద్య సౌకర్యాల కొరత లేదు'