హైదరాబాద్ గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడ సాయి వైభవ్ కాలనీలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా కాలనీలోకి వరద నీరు చేరడం వల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటికి వెళ్లాలంటే నిచ్చెనల ద్వారా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భవన నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వల్లే...
సోమవారం అర్ధరాత్రి కురిసిన వర్షానికి ఖాజాగూడ పెద్ద చెరువు పొంగి సమీపంలో నిర్మిస్తున్న భవన నిర్మాణ సెల్లార్లోకి నీరు చేరింది. సదరు నిర్మాణ సంస్థ నీటిని మోటార్ల ద్వారా నాలాల్లోకి పంపించడం వల్ల అవి పొంగి ఈ దుస్థితి ఏర్పడిందని కాలనీవాసులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నాలా మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.
ఇదీ చూడండి : ప్రభుత్వ అధికారిపై భాజపా నేత కుమారుడి వీరంగం