తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక దినం అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల 60 ఏళ్ల కోరికను సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేరవేర్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలు జరిగాయని చెప్పిన నాయకులు ఇప్పుడు నియంత పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
అన్ని వర్గాలు కష్టాలు పడుతున్నారని.. యువతకు ఉద్యోగాలు రావడం లేదని ఉత్తమ్ విమర్శించారు. తెలంగాణ వచ్చినప్పుడు 12 లక్షల నిరుద్యోగులు ఉంటే ఇప్పుడు 24 లక్షలు ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు అన్ని పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్క ప్రాజెక్టు దగ్గర తట్టెడు మట్టి పోయలేదన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని... రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఒక్క ఎకరాకు నీళ్లు రాలేదని మండిపడ్డారు.
"పక్క రాష్ట్రం వాళ్ళు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణ నీళ్లు దోచుకపోతుంటే పాలకులు కళ్ళు మూసుకొని కూర్చున్నారు. తెలంగాణ ఇచ్చే నాటికి ధనిక రాష్ట్రంగా ఉంటే ఇప్పుడు 3 లక్షల కోట్లు అప్పులు చేశారు. ఏటా రూ. 36 వేల కోట్లు చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం అంటే ఎన్ని అప్పులు చేశారో అర్థం చెసుకోవచ్చు. ఈ రోజు కృష్ణా నది ప్రాజెక్టుల సందర్శనకు కాంగ్రెస్ నాయకులు పోతామంటే పొద్దున్నే పోలీస్లు హౌస్ అరెస్ట్ చేశారు. 2014 నాటి నుంచి కృష్ణా ప్రాజెక్టులు పెండింగులో పెట్టారు. తెలంగాణ సాధన ఏ లక్ష్యాలతో సాధించమో వాటన్నింటిపైనా పోరాటాలు చేస్తాం."
-ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు
ఇదీ చదవండి: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. ఈసారి గిట్లనే!