రాష్ట్రంలో లాక్డౌన్ సమయాలను పొడిగించడంతో పాస్పోర్టు సేవలు యథాతథంగా రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ప్రధానంగా లాక్డౌన్ సమయంలో ఆగిన 14తపాలా కార్యాలయాల్లో పాస్పోర్టు సేవలు పునరుద్దరిస్తున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు అధికారి బాలయ్య తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతుండడంతో నివారణ చర్యల్లో భాగంగా గత నెల 12 నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చింది.
ఆరోజు నుంచి రాష్ట్రంలో పూర్తిగా పాస్పోర్టు సేవలు ఆగిపోయాయి. అత్యవసరంగా విదేశాలకు వెళ్లే వారి కోసం లాక్డౌన్ సమయంలో సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్పోర్టు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ద్వారా సేవలు అందుబాటులోకి వచ్చాయి. లాక్డౌన్ సడలింపు సమయాలను పొడిగించడంతో ఈ నెల 1 నుంచి రాష్ట్రంలోని 5 పాస్పోర్టు సేవా కేంద్రాల్లో పాస్పోర్టు సేవలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పునరుద్దరించారు.
తాజాగా రేపటి నుంచి గతంలో ఆగిన రాష్ట్రంలోని 14 తపాలా కార్యాలయాల ద్వారా పాస్పోర్టు సేవలు పునరుద్దరిస్తున్నట్లు ఆయన వివరించారు. అందులో వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్, మహబూబ్నగర్, సిద్దిపేట, మేడ్చల్, భువనగిరి, వికారాబాద్, వనపర్తి, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డిల్లోని తపాలా కార్యాలయాల్లో పాస్పోర్టు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపు సమయాలు పొడిగింపుతో ఈ 14 తపాలా కార్యాలయాల సేవలు, పాస్పోర్టు సేవా కేంద్రాల సేవలు ప్రారంభమవుతున్నట్లు పేర్కొన్న బాలయ్య… అన్ని పాస్పోర్టు సేవా కేంద్రాలు సాధారణ సమయాల్లో పని చేస్తాయని స్పష్టం చేశారు.