వరసగా రెండు రోజులపాటు ఎక్కువ సంఖ్యలో నమోదైన కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. వనస్థలిపురంలో ఒకే కుటుంబంలో ఆరు పాజిటివ్ కేసులు రాగా.. ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్కేడీనగర్లో ఉంటున్న ఆ కుటుంబానికి చెందిన బంధువుల్లో ఓ వ్యక్తికి(45) కరోనా సోకింది. ఇప్పటికే అతని భార్య, కుమారుడు కరోనాతో గాంధీలో చికిత్స పొందుతున్నారు. వారి ద్వారా ఇతనికి వ్యాపించింది.
ఈ కుటుంబాల్లోని సభ్యులు వ్యాపారాలు చేస్తుండటం వల్ల ఎంతమందికి వైరస్ సోకి ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. 160 మందికిపైనే గుర్తించి వారిని క్వారంటైన్లో పెట్టారు. అయితే వీరి వద్ద పాలు కొనుగోలు చేసిన ఓ వృద్ధురాలికి కూడా వైరస్ సోకడంతో ఆమె కుమారుడు, కుమార్తె, అల్లుడు, పనిమనిషి మరో ఇద్దరు వేరే వ్యక్తులను హోం క్వారంటైన్లో పెట్టారు.
నేడు రానున్న ఫలితాలు
కొందరి శాంపిళ్లు తీసి పరీక్షలకు పంపారు. ఫలితాలు మంగళవారం రానున్నాయి. మరోవైపు గాంధీలో ఇంకా 495 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకోవడంతో 40 మందిని సోమవారం డిశ్ఛార్జి చేసి ఇళ్లకు పంపారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలని, ఇతర సభ్యుల మధ్య ఎడం పాటించాలని, మాస్క్ ధరించాలని వైద్యులు సూచించారు.
- వనస్థలిపురం రైతుబజార్ను మూసివేయడంతో నిత్యం రద్దీగా కనిపించే ఆ ప్రాంతం సోమవారం నిర్మానుష్యంగా మారింది. ఆయా ప్రాంతాల్లో అధికారులు హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.
- కొవిడ్-19 నిర్ధారణతో ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిలో సోమవారం నాటికి ఇద్దరు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు మరో నలుగురు అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరారు. ఫీవరాసుపత్రిలో సోమవారం ఏడుగురు కొవిడ్-19 అనుమానిత లక్షణాలతో చేరారు.