వృద్ధాప్యంలో ఉన్న ఆ దంపతులను అనారోగ్యం వెంటాడింది. ఉన్న ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి పంపించేశారు. చివరి రోజుల్లో ఇద్దరికీ ఉన్న జబ్బులు వారిని కుంగదీశాయి. ఇక ఎవరికీ భారం కాకూడదని నిర్ణయించుకున్నారు. రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో హర్యాన్ చెరువులో జరిగిన ఈ సంఘటన విషాదాన్ని నింపింది.
హర్యాన్ చెరువు గ్రామానికి చెందిన సుధాకర్, రామలీలా దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారు పెళ్లిళ్లై ఇతర ప్రాంతాల్లో ఉంటున్నారు. కొంత కాలంగా సుధాకర్ వెన్నెముక నొప్పితో బాధపడుతుండగా... బెంగళూరులో ఉంటున్న కుటుంబ సభ్యుల సహకారంతో ఆపరేషన్ చేయించుకున్నారు. ఆపరేషన్ విఫలం కావడం వల్ల నడవలేని స్థితికి చేరుకున్నాడు. ఇందుకు తోడు సుధాకర్ భార్య రామలీల కూడా గుండెజబ్బుతో బాధపడుతోంది. ఆమెకు కంటి చూపు కూడా మందగించగా... వృద్ధ దంపతులు మనస్తాపానికి గురయ్యారు.
అనారోగ్యంతో బతుకుతూ... పిల్లలకు భారంగా ఉండలేమని భావించారు. ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో సూసైడ్ లెటర్ లభించింది.
"నాకు సర్జరీ ఫెయిల్ అయ్యింది. మళ్లీ మూడు నెలలకు ఆసుపత్రికి రమ్మనారు. నా భార్యకు కూడా గుండెజబ్బు వచ్చింది. మాకు ఎవ్వరిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేక వెళ్లిపోతున్నాం. మా పిల్లలు వారి వద్దకు రమ్మనారు. కానీ, వారిని ఇబ్బంది పెట్టటం ఇష్టంలేదు. మా చావుకి ఊరు, పిల్లలు ఎవ్వరూ కారణం కాదు "
వృద్ధ దంపతులు రాసిన సూసైడ్ లెటర్ అందరిని కంటతడి పెట్టిస్తోంది.
ఇదీ చదవండి: సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో కల్నల్ సంతోష్ అంతిమయాత్ర ప్రారంభం