కరోనా తొలి దశ నుంచి జనం పాఠాలు నేర్చుకోలేదని వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాస రావు అన్నారు. కరోనా చికిత్సపై ఆందోళన అవసరం లేదని.. రాష్ట్రంలో పడకలు, మందుల కొరత లేదని స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. 44 ప్రత్యేక కొవిడ్ ఆస్పత్రులున్నాయని తెలిపారు. రోజూ లక్షకుపైగా కరోనా పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించారు.
పడకల సంఖ్యను రెట్టింపు చేశామని 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అందిస్తున్నామని చెప్పారు. 15-20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉన్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు ఉన్నాయన్నారు. 80 శాతం కరోనా బాధితుల్లో లక్షణాలు లేవని.. కొవిడ్ రెండో దశ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని స్పష్టం చేశారు.
కరోనా పోయిందనే భ్రమలో జనం ఉన్నారని.. మహారాష్ట్ర నుంచి సరిహద్దు జిల్లాకు 20 మంది వచ్చారని.. వారు సరిహద్దు జిల్లాలో ఉత్సవంలో పాల్గొన్నారని తెలిపారు. ఉత్సవం కారణంగా 435 వరకు కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. గాలి ద్వారా వ్యాపించే దశకు కరోనా చేరుకుందని.. కొత్త మ్యుటేషన్ల కారణంగా వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. 15 రోజుల్లోనే పాజిటివ్ రేటు రెట్టింపు అయిందన్నారు.
20 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు ప్రభుత్వాస్పత్రుల్లో ఉంచామని.. దేశంలో రోజుకు 20 వేల రెమిడెసివిర్ ఇంజక్షన్లు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. రెమిడెసివిర్పై ప్రైవేటు వైద్యులకు అవగాహన కల్పించామని.. రెమిడెసివిర్, ఆక్సిజన్కి సంబంధించి కమిటీ పని చేస్తోందని తెలిపారు. కరోనా నిబంధనలు రాజకీయ పార్టీలకూ వర్తిస్తాయని.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో పరీక్షలు పెంచామన్నారు. ఇండస్ట్రియల్ ఆక్సిజన్ని పూర్తిస్థాయిలో వైద్య అవసరాలకు వాడుతున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: సాగర్ సమరం : ఓటు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు