The case of Baiting MLAs: హైదరాబాద్ వ్యాపారి నందకుమార్పై అధికారులు పలు ప్రశ్నలు సంధించారు. ఆయన కొన్ని రోజుల కిందట పలుమార్లు దిల్లీకి వెళ్లొచ్చిన వ్యవహారంపై కూపీ లాగారు. తరచూ దిల్లీ వెళ్లాల్సిన అవసరమేంటని, అక్కడ ఎవరెవరిని కలిశారని ఆరా తీశారు. మరో వ్యక్తితో ఆర్థిక లావాదేవీలు నిర్వహించిన విషయంపై ప్రశ్నించారు. అతడి ఫొటో చూపించి.. భారీమొత్తంలో డబ్బు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అడిగారు.
అధికారుల ప్రశ్నలకు నందకుమార్ పొంతన లేని సమాధానాలివ్వగా, అవి సరైనవి కావని తమ వద్ద ఉన్న పక్కా ఆధారాలను బట్టి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రామచంద్రభారతి, సింహయాజిలను కూడా ప్రశ్నించి వివరాలు రాబట్టారు. రామచంద్రభారతి సెల్ఫోన్లోని చాటింగ్ల సారాంశంతోపాటు కాంటాక్టు జాబితాలోని వ్యక్తులతో అతడి సంబంధాల గురించి అడిగారు.
తొలుత ఫోరెన్సిక్ ల్యాబ్కు.. అనంతరం పోలీస్స్టేషన్కు: నిందితులను శుక్రవారం జైలు నుంచి నేరుగా నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి తరలించారు. ఆడియోలో మాట్లాడిన వివరాలను సరిపోల్చడానికి ల్యాబ్లో స్వరపరీక్షలు నిర్వహించారు. పోలీసులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన ఆడియో, వీడియో రికార్డుల్లోని మాటలను.. నిందితుల స్వరంతో పోల్చేందుకు ఈ పరీక్షలు చేశారు.
అనంతరం నిందితులను వేరువేరుగా రాజేంద్రనగర్ ఠాణాకు తరలించారు. సిట్ సభ్యులైన డీసీపీలు కల్మేశ్వర్, జగదీశ్వర్రెడ్డి, ఏసీపీ గంగాధర్, ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి నిందితులను అక్కడికి తీసుకొచ్చారు. సిట్ సభ్యులతో పాటు సైబరాబాద్ ఎస్వోటీ అదనపు డీసీపీ నారాయణ, అదనపు డీసీపీ (క్రైం) నర్సింహ్మరెడ్డి ఠాణాకు వచ్చారు. ముగ్గురు నిందితులను వేర్వేరు గదుల్లో విచారించారు. మొదటిరోజు చాలా ప్రశ్నలకు తమకు తెలియదన్నట్లుగా ముక్తసరిగా స్పందించిన నిందితులు.. రెండోరోజు కొన్నింటికి సమాధానాలివ్వక తప్పలేదు.
![](https://assets.eenadu.net/article_img/111122gh-main16b.jpg)
ఓ వైపు సమీక్ష.. మరోవైపు విచారణ: మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధిపతి సీవీ ఆనంద్ రాజేంద్రనగర్ ఠాణాకు వచ్చారు. సిట్ సభ్యులతో సమీక్షించి.. విచారణ తీరును తెలుసుకున్నారు. కోర్టు ఇచ్చిన గడువు రెండు గంటల్లో ముగుస్తుందనగా, ఆయన కొన్ని ప్రత్యేక ప్రశ్నలను సిద్ధం చేసుకుని నిందితులను వేర్వేరుగా విచారించినట్లు తెలిసింది.