నగరపాలక సంస్థల పాలకమండళ్లకు మేయర్లు, పురపాలక సంస్థల పాలకమండళ్లకు ఛైర్పర్సన్లు నేతృత్వం వహిస్తారు. పాలకమండళ్ల సమావేశాలకు అధ్యక్ష్యత వహించనున్న మేయర్లు, ఛైర్ పర్సన్లు పురపాలనను సాఫీగా సాగించాల్సి ఉంటుంది. మేయర్లు, ఛైర్పర్సన్ల కర్తవ్యాలు, బాధ్యతలను పురపాలక చట్టంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
చట్టంలో 23వ విభాగం ప్రకారం.. ప్రతి నెల ఒకసారి పాలకమండలిని సమావేశపరచాలి. కౌన్సిల్ సభ్యులంతా.. లేదా సగం మంది సభ్యులు లిఖితపూర్వకంగా కోరినప్పుడు పాలకమండలి భేటీ కావాలి. పట్టణంలో పారిశుద్ధ్యం, నీటి సరఫరాతో పాటు వీధి దీపాలు సరిగా నిర్వహించాలి. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా స్థాయి కమిటీ నిర్ణయించిన మేరకు పట్టణంలో నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు, ఖాళీ స్థలాలను పరిరక్షించాలి.
ఏటా పురపాలిక లెక్కల ముగింపు ఆడిటింగ్ చేపట్టాలి. పురపాలికకు సంబంధించిన ఆస్తులను ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై 24 గంటల్లోగా ఛైర్పర్సన్లు సంతకం చేయాల్సి ఉంటుంది. కౌన్సిల్ మంజూరు లేని పనిని జిల్లా కలెక్టర్ అనుమతి తీసుకొనే చేయాల్సి ఉంటుంది.
ఇదీ చదవండిః బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో సత్తాచాటిన పెద్దపల్లి విద్యార్థిని