క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో పేరొందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారత్లో.. తమ రెండో ఏడబ్ల్యూఎస్ రీజియన్గా హైదరాబాద్ను ఎంచుకోవడంపై రంగారెడ్డి జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత భారీ ఎత్తున రంగారెడ్డి జిల్లాకు పెట్టుబడి తరలిరావడం వల్ల స్థానిక యువతకు అనేక ఉపాధి అవకాశాలు దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెజాన్తో పాటు ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, మాన్యుఫాక్చరింగ్ రంగాల్లో అనేక కంపెనీలు రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటం వల్ల రాబోయే ఒకట్రెండేళ్లలో జిల్లా ముఖచిత్రం మారిపోతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుమన్, జీవన్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జడ్పీ ఛైర్ పర్సన్ తీగల అనితారెడ్డి కేటీఆర్కు అభినందనలు తెలిపారు.
రాష్టంలో ప్రతిష్ఠాత్మక అమెజాన్ సంస్థ రూ. 20,761 కోట్ల భారీ పెట్టుబడి వ్యయంతో ప్రాజెక్టు ప్రకటించడంలో మంత్రి కేటీఆర్ కృషి ఎంతో ఉందని ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు అడుగులు పడుతున్నాయని కొనియాడారు. భారీ పెట్టుబడులతో హైదరాబాద్ నగర శివార్లలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నాలుగేళ్లలో ఇదంతా జరగడం గర్వకారణం: కేటీఆర్