తన నివాసం నుంచి బయటకురాకుండా కట్టడి చేయాలని ఎస్ఈసీ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈమేరకు శనివారమే ఆయన హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని మంత్రి తరఫు న్యాయవాది కోరగా.. ఇవాళ విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది.
ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలతో.. రాష్ట్రపతి చిత్తూరు పర్యటనలో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొనే అంశంపై సందిగ్ధత నెలకొంది. తాను జారీచేసిన నిషేధాజ్ఞలను... కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లిన రాష్ట్ర ఎన్నికల కమిషన్.. రాష్ట్రపతి ఆహ్వానితుల జాబితాలో పెద్దిరెడ్డి ఉన్నందున తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
మరోవైపు పరిమిత కాలంపాటు అధికారం కల్గి ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్.. ఏపీ ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని.. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎస్ఈసీ వైఖరి చూస్తుంటే... పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తారనే అనుమానం వస్తోందన్న సజ్జల.. వాటిని కూడా స్వాగతిస్తామని పేర్కొన్నారు.
ఇదీచదవండి: 'దళిత, గిరిజనులు ఉన్నత విద్య అభ్యసించాలి'