దేశంలో 50లక్షల ఎకరాలలో .. వెదురు సాగుతో ఇథనాల్ తయారు చేయడం ద్వారా మన ఇంధన అవసరాలు తీరుతాయని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు గ్రో మోర్ బయోటెక్ లిమిటెడ్ వెదురు పరిశోధన కేంద్రాన్ని పరిశీలించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. గ్రోమోర్ బయోటెడ్ అధినేత, ప్రఖ్యాత వెదురు శాస్త్రవేత్త భారతి అనుభవాన్ని వెదురు సాగులో ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
ఏడాదికి 40 టన్నుల దిగుబడి...
శాస్త్రవేత్త భారతి అనుభవంతో స్వయంగా వెదురు సాగు చేయాలని నిర్ణయించుకున్నట్లు మంత్రి వెల్లడించారు. అక్కడ టిష్యూకల్చర్ విభాగం చాలా బాగుందన్నారు. భీమా బంబూ ఇథనాల్ తయారికీ అనుకూలమని మంత్రి పేర్కొన్నారు. వెదురు ఒక్కసారి నాటితే 60 నుంచి 70 ఏళ్లు దిగుబడి ఉంటుందని... నాలుగో ఏడాది నుంచే దిగుబడి ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు. ఎకరాకు ఏడాదికి 40 టన్నుల దిగుబడి రానుండగా... టన్నుకు రూ.4500 లు ధర పలుకుతుందన్నారు. వెదురు సాగుతో ఏడాదికి లక్షా 20వేల నుంచి లక్షా 60వేల వరకు ఆదాయం వస్తుందని మంత్రి వివరించారు. హోసూరు పర్యటనలో మంత్రి వెంట ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ నీరజా ప్రభాకర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఇదీ చదవండి:అహింసతో స్వతంత్ర సంగ్రామాన్ని ఉరకలెత్తించారు : సీఎం కేసీఆర్