రాష్ట్ర అభివృద్ధిలో శాంతిభద్రతలు కీలకపాత్ర పోషిస్తాయని హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ పోలీసులు మెుదటిస్థానంలో ఉన్నారని తెలిపారు. సికింద్రాబాద్లో సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో.... మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్ పాల్గొన్నారు. 358 సీసీ కెమెరాలు ప్రారంభించారు.
శెభాష్ హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ పరిధిలో 6 లక్షల కెమెరాలు ఉన్నాయని మహమూద్ అలీ తెలిపారు. నగరానికి అనేక పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. పోలీసు శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ఠం చేశారని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలుచేస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనని అన్నారు. షీ టీమ్స్ వల్ల అమ్మాయిలపై అరాచకాలు తగ్గాయని పేర్కొన్నారు. రూ.600 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ నిర్మిస్తున్నామని... రాబోయే 6 నెలల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో పోలీసులు ఉత్తమంగా పని చేశారని కొనియాడారు. కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
పెట్టుబడులకు శాంతి భద్రతలు కీలకం
రాష్ట్రంలో అభివృద్ధికి పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు ముఖ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గానికి, హైదరాబాద్ సిటీకి తన నిధుల నుంచి రూ.2 కోట్లు ఇస్తానని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో హైదరాబాద్ పోలీసులు బాగా పని చేస్తున్నారని అభినందించారు. ప్రతి నెలా రూ.75వేలను పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ఇస్తున్నామని వెల్లడించారు.
గ్రామాల్లో నిఘా నేత్రాలు
సీసీ కెమెరాలను గ్రామాల్లోనూ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. వీటి ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం... ప్రజాప్రతినిధులు సహకారం అందించడం గొప్ప విషయమని కొనియాడారు. వీటిని ఉపయోగించి నిందితులను 24 గంటల్లో కేసును ఛేదిస్తున్నామని వివరించారు.
ధన్యవాదాలు
సీసీ కెమెరాల వల్ల నేరస్థులను త్వరగా పట్టుకుంటున్నామని సీపీ అంజనీ కుమార్ అన్నారు. వీటి ఏర్పాటుకు ముందుకు వస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఇదీ చదవండి: ఈ వంటింటి చిట్కాలతో జీర్ణ సంబంధ సమస్యలకు చెక్ పెట్టండి!