లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని నేతన్నలకు నగదు లభ్యత పెరిగేలా.. నేతన్నకు చేయూత పథకం కింద నగదు సాయం అందించేందుకు సిద్ధమైనట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ పొదుపు పథకంలో చేరిన నాటి నుంచి మినహాయింపునిస్తున్నామన్నారు. అయితే ప్రస్తుతం ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తక్షణమే నేతన్నలు ఈ పథకం నుంచి నగదు అందుకునే సౌలభ్యాన్ని కల్పించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. తద్వారా 26,500 మంది నేతన్నలు తక్షణ ఉపశమనం కింద లబ్ధి పొందుతారని కేటీఆర్ తెలిపారు.
రూ.50 నుంచి లక్షా 25 వేల వరకు నగదు !
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మినహాయింపుతో ఈ పథకంలో భాగస్వాములైన నేతన్నలకు రూ.50 వేల నుంచి సుమారు రూ.1.25 లక్షల వరకు నగదు అందుబాటులోకి వస్తుందని కేటీఆర్ తెలిపారు. దీంతోపాటు సొసైటీల పరిధిలో ఉన్నటువంటి కార్మికులకు గతంలో ముగిసిన పొదుపు పథకం డబ్బులను చెల్లించడం ద్వారా మరో రూ.కోటి 18 లక్షలను నేతన్నలకు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.
చేనేత ఉత్పత్తులకు డిమాండ్..
రాష్ట్రంలోని నేతన్నలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ.. వారి ఉత్పత్తులకు డిమాండ్ కల్పించే దిశగా అనేక కార్యక్రమాలను తీసుకున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఆపత్కాలంలోనూ నేతన్నలను ఆదుకుంటామని.. త్వరలోనే పరిస్థితులు సర్దుకుంటాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశం సందర్భంగా బతుకమ్మ చీరల ఉత్పత్తి ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. శనివారం సమావేశంలో ఎరోస్పేస్ డిఫెన్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి పరిశ్రమల శాఖలోని పలు విభాగాల వారీగా సమీక్షించారు.
ఇదీ చూడండి : 'అభివృద్ధికి వ్యతిరేకం కాదు.. అవినీతికి వ్యతిరేకం