రక్తం పంచుకుపుట్టిన ముగ్గురు అక్కలపై ఓ ఉన్మాది కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు తొబుట్టువులు చనిపోగా... మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మూడో అక్కను చంపేటప్పుడు అడ్డుగా వచ్చిన బావనూ పొడిచేశాడు. నాలుగో అక్కనూ చంపుదామనుకున్నాడు. హైదరాబాద్ పాతబస్తీ సోమవారం రాత్రి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట ఠాణా పరిధి బార్కస్ సలాలాలో అహ్మద్ ఇస్మాయిల్(27) అనే మాజీ బౌన్సర్ తల్లి పుత్లీబేగంతో కలిసి ఉంటున్నాడు. సోమవారం ఇంటికి వచ్చిన ఇద్దరక్కలు రజియాబేగం, జకిరాబేగంలపై కత్తితో దాడిచేశాడు.
అనంతరం అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలోని నబీల్కాలనీలో ఉంటున్న మూడో సోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి ఆమెపై, బావ ఉమర్పై కత్తితో దాడి చేసి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న అదనపు సీపీ(ట్రాఫిక్)అనిల్కుమార్ అక్కడికి చేరుకున్నారు.
రజియాబేగం అప్పటికే చనిపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న జకిరాబేగం, నూరాబేగం, ఉమర్లను ఒవైసీ ఆసుపత్రికి తరలించారు. జకిరాబేగం చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. నూరాబేగం, ఉమర్లకు వైద్య చికిత్స అందిస్తున్నారు. నిందితుడు ఇస్మాయిల్ గతేడాది మార్చిలో తన భార్యను ఇదేవిధంగా గొంతు కోసి చంపేశాడని పోలీసులు తెలిపారు.
అమ్మకు బాగాలేదని పిలిచి..
తన అక్కలను చంపేందుకు ముందుగానే పథకం వేసుకున్న ఇస్మాయిల్.. సోమవారం ఉదయం తల్లికి బాగాలేదని రజియాబేగంకు ఫోన్ చేశాడు. ఆమె ఉదయం 11 గంటలకు వచ్చింది. సాయంత్రం జకిరాబేగంకు కూడా చెప్పడంతో ఆమె కూడా వచ్చింది.
నలుగురూ సాయంత్రం మాట్లాడుకున్నారు. అక్కలు వంటింట్లో ఉండగా... ఇస్మాయిల్ కత్తితో అక్కడికి వెళ్లి దాడి చేశాడు. రజియాబేగం గొంతుకోశాడు. జకిరాబేగంపై దాడిచేసి తల్లి పుత్లీబేగం చూస్తుండగానే బయటకు వచ్చాడు. నేరుగా నబీల్కాలనీలోని మూడోసోదరి నూరాబేగం ఇంటికి వెళ్లి అమెనూ కత్తితో పొడిచాడు. అడ్డొచ్చిన ఆమె భర్తపైనా దాడి చేసి పారిపోయాడు.
నాలుగో అక్కనూ...
అక్కడి నుంచి ఇస్మాయిల్ నాలుగో అక్క మలికాబేగంనూ చంపాలని బార్కస్ సలాలాకు సమీపంలో ఉన్న ఆమె ఇంటికీ వెళ్లాడు. సోదరిని ఆసుపత్రిలో చేర్చారని తెలుసుకొని వారిపై దాడిచేసేందుకు ఒవైసీ ఆసుపత్రికి వెళ్లాడు.
పోలీసులు ఉండడంతో పారిపోయాడు. ఆసుపత్రికి వెళ్లేటప్పుడు దారిలో బంధువు కనిపించగా.. ‘మా అక్కలు చెప్పినందుకే గతేడాది నా భార్యను చంపాను. ఇప్పుడు వారిని చంపి ప్రతీకారం తీర్చుకున్నా అంటూ చెప్పాడు.
భార్యను చంపిన కేసులో ఇస్మాయిల్పై పోలీసులు కోర్టులో అభియోగపత్రాలు సమర్పించారు. ఇంకా విచారణకు రాలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు.
ఆదివారం ఈ కుటుంబ సభ్యులంతా ఆస్తి పంచుకునేందుకు సమావేశమయ్యారని నగర ట్రాఫిక్ అదనపు సీపీ అనిల్కుమార్ తెలిపారు. ఆ సమావేశం ప్రశాంతంగా ముగిసిందని, ఆ తర్వాతే నిందితుడు హత్యకు పథకం రచించి ఉంటాడని ఆయన వెల్లడించారు. నిందితుని కోసం గాలిస్తున్నామన్నారు.
ఇదీ చూడండి: మా సిస్టం ఎప్పుడూ ఫెయిల్ కాదు: సీపీ అంజనీ కుమార్