ఏపీ ప్రకాశం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీరు తగ్గినప్పటికీ గుంటూరు జిల్లా పశ్చిమ డెల్టా పరిధిలోని లంక గ్రామాల రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు. ఉద్యానపంటలైన పసుపు, కంద, అరటి, మినుము ఇంకా నీళ్లల్లోనే నానుతున్నాయి. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలోనూ పంటపొలాలది ఇదే దుస్థితి.
కొల్లిపర, కొల్లూరు మండలాల్లో...
కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని 21 లంక గ్రామాలు, భట్రిప్రోలు, రేపల్లె మండలాలు ఇప్పుడిప్పుడే వరద గుప్పిట నుంచి బయటపడుతున్నాయి. అయితే ఇంకా ద్విచక్రవాహనాల ద్వారా రాకపోకలు సాగించే వీలు లేకపోవటంతో నిత్యావసరాల కోసమైనా ట్రాక్టర్లనే ఆశ్రయిస్తున్నారు.
అమరావతి మండలంలో...
అమరావతి మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఏపీ మంత్రులు సుచరిత, శ్రీరంగనాథరాజు పర్యటించారు. వర్షాల వల్ల నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొల్లూరు, కొల్లిపర మండలాల్లో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, అన్నాబత్తుని శివకుమార్ పర్యటించారు.
తోట్లవల్లూరు మండలంలో...
కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలంలోని ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు కైలా అనిల్, పార్ధసారథి, ఎంపీ బాలశౌరి పర్యటించారు. బాధితులను పరామర్శించారు. పెనుగంచిప్రోలుకు చెందిన గరుడాచలం అనే రైతు పొలంలో పనిచేస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.