కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్.. విదేశాల్లో పీజీ చదవాలనుకునేవారికి ‘కేసీ మహీంద్రా స్కాలర్షిప్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టడీస్ అబ్రాడ్’ స్కాలర్షిప్ను అందజేస్తోంది. ఏటా అందించే ఈ స్కాలర్షిప్లకు సంబంధించి ప్రకటన విడుదలైంది. విద్యాపరంగా ప్రతిభావంతులై ఉండి, ఆర్థికంగా వెనుకబడినవారికి చేయూతనివ్వాలనే ఉద్దేశంతో వీటిని అందజేస్తున్నారు.
అర్హులైనవారికి రూ.4 లక్షల వరకూ వడ్డీ లేని లోన్ స్కాలర్షిప్ను అందజేస్తారు. దీంతోపాటు ‘కేసీ మహీంద్రా ఫెలోస్’గా ముగ్గురిని ఎంపిక చేసి, ఒక్కొక్కరికి రూ.8లక్షల చొప్పున స్కాలర్షిప్గా అందజేస్తారు.
దరఖాస్తు చేసుకునేవారు భారతీయులై ఉండాలి. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ విద్యాసంస్థ నుంచి డిగ్రీ/ తత్సమాన డిప్లొమా పూర్తిచేసుండాలి. మొదటి తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండటం తప్పనిసరి. దరఖాస్తు సమర్పించేనాటికి విదేశీ విద్యాసంస్థలో అడ్మిషన్ పొంది గానీ లేదా ప్రవేశ నిమిత్తం దరఖాస్తు గానీ చేసుకుని ఉండాలి. అకడమిక్ ప్రోగ్రామ్ ఆగస్టు 2021 నుంచి ఫిబ్రవరి 2022 మధ్య ప్రారంభమయ్యేలా ఉండాలి.
మెరిట్, అవసరం ఆధారంగా స్కాలర్షిప్లను కేటాయిస్తారు. అభ్యర్థి భవిష్యత్ లక్ష్యాలనూ పరిగణనలోకి తీసుకుంటారు.
దరఖాస్తు ఎలా?
ఆసక్తి ఉన్నవారు సంస్థ వెబ్సైట్ https://www.kcmet.org/index.aspx లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థి వివరాలతోపాటు కొన్ని ధ్రువపత్రాలు-
- అడ్మిషన్ లెటర్ కాపీలు
- లెటర్ ఆఫ్ రెకమెండేషన్
- అభ్యర్థి ఆసక్తులు, లక్ష్యాలను తెలుపుతూ స్టేట్మెంట్
- జీఆర్ఈ/జీమ్యాట్ స్కోరు
- ఐఈఎల్టీఎస్/ టోఫెల్ స్కోరు
- 10, 12, డిగ్రీ ధ్రువపత్రాల కాపీలు
- వయసు ధ్రువీకరణ పత్రం
- తాజా సీవీ సమర్పించాల్సి ఉంటుంది.
వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అర్హులను ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. వారికి జులైలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ సమయానికి అడ్మిషన్ పొందివుండాలి.
- దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మార్చి 31, 2021