ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణకు రాష్ట్ర ప్రభుత్వం అందించే దాశరథి పురస్కారం లభించాలని ప్రభుత్వం సలహాదారుడు కేవీ రమణాచారి ఆకాంక్షించారు. ఎన్నో రచనలు చేసిన వడ్డేపల్లి కృష్ణకు దాశరథి అవార్డు వచ్చినట్లే వచ్చి పోతుందన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తెలుగు టెలివిజన్ రచయితల సంఘం, భారత్ కల్చరల్ అకాడమి హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా కవి కాళోజీ సాహితీ పురస్కారం అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణను ప్రజా కవి కాళోజీ-2021 సాహితీ పురస్కారం, మల్లిక్కు కాళోజీ-2020 పురస్కారం, తుమ్మూరి రామ్మోహనరావుకు వానమామలై-2020 పురస్కారంతో ఘనంగా సత్కరించారు. ప్రస్తుతం వెండితెర కంటే బుల్లి తెరకే ప్రజాధారణ ఎక్కువగా ఉందని రమణాచారి అన్నారు. త్వరలోనే టీవీ నగర్ ఏర్పాటు చేసుకుందామని ఆయన చెప్పారు. కవులకు, కళాకారులకు పురస్కారాలు అనేవి మరింత ప్రోత్సహాన్ని అందిస్తాయని కాళోజీ అవార్డు గ్రహిత వడ్డేపల్లి కృష్ణ అన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా కాళోజీ అవార్డు రావడం దేవి ప్రసాదంగా భావిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి న్యూదిల్లీ సముద్రాల వేణుగోపాలాచారి, తెలంగాణ గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ శ్రీధర్, టెలివిజన్ రచయితల సంఘం వ్యవస్థాపకులు నాగబాల సురేష్కుమార్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రామోజీ ఫిల్మ్ సిటీ శుక్రవారం రీఓపెన్