హైదరాబాద్ నగరవాసుల్లో కరోనాపై అవగాహన క్రమేపీ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య అధికమవుతుండటంతో అధికారులూ రంగంలోకి దిగారు. పోలీసుశాఖ ద్వారా అందిన సమాచారం ప్రాతిపదికగా వైద్యశాఖ, జీహెచ్ఎంసీ, రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు నడుంబిగించారు.
చైనాలో కరోనా కల్లోలం మొదలైనప్పట్నుంచి నగరానికి వేర్వేరు దేశాల నుంచి పలువురు రాకపోకలు సాగించారు. విమానాశ్రయాల్లో ఆయా ప్రయాణికుల ఉష్ణోగ్రత పరిశీలించినప్పుడు పరిస్థితి సాధారణంగా కనిపించిందని, తరువాత కొన్ని రోజులకు వైరస్ ప్రభావం ఉంటోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల నమోదవుతున్న పలు కేసుల్లో ఇదే విషయం తేలిందన్నారు.
ఇప్పటివరకు కరోనా ప్రభావిత దేశాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన వారిని మరోమారు పరీక్షించేందుకు బృందాలుగా వెళ్తున్నట్లు బల్దియా తెలిపింది. ఇందులో నాలుగు శాఖల సిబ్బంది ఉంటారు. వ్యాధి లక్షణాలను పసిగట్టే వైద్య ఆరోగ్యశాఖ నిపుణులు, భద్రత కోసం పోలీస్ సిబ్బంది, చిరునామాతోపాటు సహకారం కోసం బల్దియా, రెవెన్యూ అధికారులను వెంట తీసుకెళ్తున్నట్లు జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య విభాగం అధికారులు తెలిపారు. సోమవారం కొందరిని మాత్రమే పరిశీలించామని, మంగళవారం ఎక్కువమందితో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందికి శిక్షణ.. నగరవ్యాప్తంగా 18 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనాపై వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించినట్లు బల్దియా ముఖ్య వైద్యాధికారి(సీఎంహెచ్వో) అమర్ తెలిపారు. సిబ్బందిని పర్యవేక్షించే జవాన్లు, శానిటరీ సూపర్వైజర్లు, సహాయ వైద్యాధికారులు, పారిశుద్ధ్య విభాగం డిప్యూటీ ఇంజినీర్లకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, ఇతర రక్షణ పరికరాల పంపిణీ మొదలైందన్నారు. చాలా ప్రాంతాల్లో కార్మికులు మాస్కులు లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. వ్యర్థాలను చేతులతో పట్టుకోవడం అనారోగ్యానికి దారి తీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.