Hybrid work style in IT companies: హైదరాబాద్లోని ఐటీ సంస్థలు ఉద్యోగులతో కళకళలాడేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. గతంతో పోలిస్తే.. కరోనా తగ్గుముఖం పట్టినా అత్యధిక సంస్థలు ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయానికి పిలవడం లేదు. వాస్తవానికి జులై చివరి నాటికే ఐటీ కంపెనీలు ఉద్యోగులను పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పించేందుకు ఏర్పాట్లు చేశాయి. మారిన పరిస్థితులతో ఇది సాధ్యం కావడం లేదు. ఎక్కువ మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో కార్యాలయంలో పని చేసేందుకు విముఖత వ్యక్తం చేయడం, కరోనా నేపథ్యంలో కొన్ని సంస్థలు కార్యాలయ ప్రాంగణాన్ని కుదించడం, ఒకేసారి అందరితో పని చేయించే అవకాశం లేకపోవడమే ఇందుకు కారణాలు. ప్రత్యామ్నాయంగా హైబ్రిడ్ పని విధానాన్ని పొడిగిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకూ ఇదే పరిస్థితి ఉండే అవకాశముందని ఐటీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం నగరంలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను కార్యాలయాలకు పిలిపించిన సంస్థలను వేళ్లపై లెక్కించొచ్చని ఐటీ ఉద్యోగులు చెబుతున్నారు. నగరంలోని ఐటీ సంస్థల్లో దాదాపు 7.78 లక్షల మంది పని చేస్తున్నారు. కరోనాతో దాదాపు రెండేళ్ల పాటు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. దీంతో కొందరు సొంతూళ్లకు వెళ్లిపోయి పని చేశారు. వారికి రవాణా, ఇంటి అద్దె, ఇతర ఖర్చుల భారమూ తప్పింది. దీంతో కార్యాలయాలకు వచ్చి పని చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడడం లేదు. అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకునేందుకూ కొందరు వెనుకాడడం లేదు. దీంతో మధ్యేమార్గంగా హైబ్రిడ్ పనివిధానాన్ని సంస్థలు పొడిగిస్తున్నాయి.
మరికొన్ని నెలలు ఇదే పరిస్థితి..: కొన్ని సంస్థలు ఇంటి నుంచి పని చేసే రోజులను రెండు నెలలకోసారి కుదిస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్లోని ఓ బహుళ జాతి సంస్థ జులైలో వారానికి రెండు రోజులు కార్యాలయానికి రావాలని సమాచారమిచ్చింది. ఈ నెల నుంచి దాన్ని 3 రోజులకు పెంచింది. విశాలమైన భవనాల్లో ఎక్కువ అంతస్థుల్లో కార్యాలయాలు ఏర్పాటు చేసిన సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిన నేపథ్యంలో ప్రాంగణాన్ని కుదించుకున్నాయి. ఆయా భవనాలను యజమానులు ఇతరులకు అద్దెకిచ్చాయి. వాటిని తిరిగి అద్దెకు తీసుకోవాలన్నా అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఉద్యోగులను పిలిపిస్తే కార్యాలయం సరిపోదన్న ఉద్దేశంతో కొన్ని సంస్థలు మరికొన్ని నెలలు వాయిదా వేయాలని భావిస్తున్నాయి.