పలు రంగాలకు చెందిన విలువైన సమాచారాన్ని ఒకే చోట పొందేందుకు.. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్ను గురువారం ఆవిష్కరించింది. జంప్ స్టార్ట్ ఇండియా భాగస్వామ్యంతో ఐఎస్బీ నెలకొల్పిన ఈ సూచికల ద్వారా ఎకానమీ రికవరీ అంశాలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు దోహదపడతాయి.
పలు రంగాలు, విభాగాలకు సంబంధించి ప్రజా బాహుల్యంలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని www.indiadataportal.com/jsi వెబ్పోర్టల్ ద్వారా పొందవచ్చని ఐఎస్బీ ప్రకటించింది. రియల్ టైం డాటాను రోజువారీ, నెలవారీ ఈ వెబ్పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రాంతం, కాలం ఆధారంగా సమాచారాన్ని సరిపోల్చుకోవచ్చని ఐఎస్బీ తెలిపింది.
ఈ పోర్టల్లో ప్రస్తుతం ఆధార్ అథెంటిఫికేషన్, వ్యవసాయ మార్కెట్లు, ఎరువుల అమ్మకాలు, గాలి నాణ్యత, విద్యుత్ సరఫరా, డిజిటల్ పేమెంట్లు వంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని ఒకేచోట పొందే వీలుంది. ప్రస్తుతం ఆంగ్లంలోనే అందుబాటులో ఉన్న డేటాను.. ఆగస్టు నెలాఖరులోపు ఇతర భారతీయ భాషల్లోకి అనువదిస్తామని నిర్వాహకులు అశ్విని ఛత్రే, అవిక్ సర్కార్ తెలిపారు.
ఇదీ చూడండి: రష్యా టీకాపై ఇప్పుడే ఏమీ చెప్పలేం: ఎయిమ్స్