గ్రామాల్లో ఉపాధిహామీ(national rural employment guarantee news) పనులకు కూలీలను రప్పించేందుకు జిల్లా అధికారులకు ప్రభుత్వం లక్ష్యం నిర్ణయించింది. రోజుకు కనీసం 40 మంది ఈ పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లక్ష్యం మేరకు కూలీలను రప్పించి ఉపాధి పనులు చేయించలేకపోయిన అధికారుల వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు రెండు రోజులుగా పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు సహాయ, మండల, పంచాయతీ అధికారులకు ఆదేశాలిస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ పనులు జరగడంతో మూడునెలలుగా ఉపాధి పనులకు(national rural employment guarantee news) కూలీలు రావడం లేదు. కొన్ని చోట్ల ఈ పనులు నిలిచిపోయాయి. ఉపాధి పనులు లక్ష్యం మేరకు జరిగితే మెటీరియల్ నిధులు అదనంగా వస్తాయని, తద్వారా ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల పనులు చేపట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ప్రతిగ్రామంలో కచ్చితంగా రోజుకు 40 మంది ఉపాధి పనులు చేసేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీ వాడల్లో మౌలికసదుపాయాలు
దళిత బంధు పథకం అమల్లో భాగంగా దళిత వాడలు, గిరిజన ఆవాసాల పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సౌకర్యం, వీధిదీపాల ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సర్కారు నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులు ఖర్చు చేయాలని సూచించింది.
అంతేకాకుండా ఉపాధిహామీ పథకం (UPADI HAMI PATHAKAM) అమలు బాధ్యత ఈ ఏడాది నుంచి గ్రామ కార్యదర్శులకు అప్పగించారు. ఈ పథకం కింద 33.04 లక్షల కుటుంబాల్లోని 58.76 లక్షల మంది కూలీలు లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ ఏడాది నుంచి రోజువారీ వేతనాన్ని రూ.237 నుంచి రూ.245కు ప్రభుత్వం పెంచింది. గ్రామకార్యదర్శులపై నిఘా ఎక్కువగా ఉండటంతో స్థానిక ప్రజాప్రతినిధులు ఉపాధిహామీ (UPADI HAMI) సాంకేతిక సహాయకులు, ఇతర సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధిహామీ కింద చేపట్టేపనుల వివరాలను తప్పనిసరి రికార్డు చేయాలి. పనులు చేస్తున్నపుడు ఫొటోలు తీసి వాటిని భద్రపరచాలి. పూర్తయ్యాక రికార్డుల్లో నమోదు చేయాలి. ఆ తరువాతే బిల్లులు సిద్ధం చేసి పంపించాలని నిబంధనలున్నా అమలు కావడం లేదు. క్షేత్రస్థాయి పనులపై పర్యవేక్షణ కొరవడటంతో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పొలంలో ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డుల్లో నమోదు చేస్తున్నా... సోషల్ ఆడిట్ సిబ్బంది ఆ పనుల తనిఖీకి వెళ్లినపుడు పని చేసిన ఆనవాళ్లు కనిపించకపోవడం గమనార్హం.