కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ.. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీట్లను అర్హులైన రాష్ట్ర విద్యార్థులకు కాకుండా ఏపీ విద్యార్థులకు కేటాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. యూనివర్సిటీలో వెలుగు చూసిన మెడికల్ సీట్ల కుంభకోణంపై గవర్నర్ తమిళిసై స్పందించినందుకు గాను.. ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
అవకతవకలు తమ దృష్టికి వచ్చినట్లు.. తమిళసై ట్వీట్ చేశారని శ్రవణ్ పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి వివరణకు.. గవర్నర్ ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. ప్రతిభావంతులైన తెలంగాణ బిడ్డలకు న్యాయం చేయాలని ఆయన తమిళిసైకు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్లు.. ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారో తెలపాలని నిలదీశారు. విశ్వవిద్యాలయం కులపతి హోదాలో గవర్నర్ ఈ విషయంలో జోక్యం చేసుకొని.. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరారు.
మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ప్రాధాన్యతను సంతరించుకున్న వేళ గవర్నర్ ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇదీ చదవండి: 'ప్రభుత్వ వైద్య సీట్ల భర్తీలో రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం'