లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో పంటలను మద్దతు ధరకు కొనేందుకు ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి రైతులకు భాగస్వామ్యం కల్పించాలని మార్కెటింగ్ శాఖ నిర్ణయించింది. ఇప్పటికిప్పుడు ధాన్యం కొనుగోలుకు 6,500 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నందున వాటిలో సౌకర్యాలు సత్వరం సమకూర్చాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో ఎవరైనా రైతుల వద్ద సొంత టార్పాలిన్లు ఉంటే మార్కెటింగ్ శాఖ తీసుకుంటుంది. వాటికి రోజుకు రూ.50 చొప్పున అద్దె చెల్లించాలని ప్రతిపాదించింది. రైతుల వద్ద దాదాపు 50వేలకు పైగా టార్పాలిన్లు ఉన్నట్లు వ్యవసాయాధికారుల పరిశీలనలో గుర్తించారు.
అదనంగా 77వేల కొత్త టార్పాలిన్లు..
రైతు వద్ద ఉన్న ధాన్యం లేదా ఇతరత్రా పంటలను అమ్మేశాక వాటిని వృథాగా పక్కన పెడుతున్నారు. ఇప్పుడు వాటినే తీసుకుని కొనుగోలు కేంద్రాల్లో వాడుకోవడం వల్ల ప్రభుత్వానికి వెసులుబాటుతో పాటు రైతులకు ఆదాయం లభిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ బి. జనార్దన్రెడ్డి ‘తెలిపారు. ఇవేకాక అదనంగా మరో 77వేల కొత్త టార్పాలిన్లు కొంటున్నట్లు చెప్పారు. గత ఏడాది వరకూ రాష్ట్రంలోని అన్ని మార్కెట్లకు కలిపి దాదాపు లక్షన్నర టార్పాలిన్లు కొని ఇచ్చారు. అవి ఎక్కడ ఉన్నా వెంటనే కొనుగోలు కేంద్రాలకు పంపాలని మార్కెట్ కమిటీలను ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల అధికారులతోనూ..
ఇతర రాష్ట్రాల వ్యవసాయశాఖలతో మాట్లాడి ధాన్యం శుభ్రపరిచే యంత్రాలు, తేమ కొలిచే యంత్రాలు, వరికోత యంత్రాలు తెలంగాణకు తెప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు పథకంపై రైతుల్లో చక్కని స్పందన వస్తున్నట్లు వివరించారు. ముందుగా టోకెన్ తీసుకున్నవారు మాత్రమే నిర్ణీత తేదీ నాడు ధాన్యాన్ని కేంద్రానికి తేవాలని ఆయన సూచించారు. ఎవరిష్టమైనట్లు వారు వస్తే కొనుగోలుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని హెచ్చరించారు.
ఇది చూడండి: డ్రోన్ వీడియో: హైదరాబాద్ను ఇలా ఎప్పుడైనా చూశారా?