బొల్లారం మత్స్య మహిళ సొసైటీ సభ్యులు అల్వాల్ రైతు బజార్లో చేపల అమ్మకాలు ప్రారంభించారు. సొసైటీ అధ్యక్షురాలు బాధ పద్మ బెస్త ఆధ్వర్యంలో మత్స్య మహిళలు చేపలు, రొయ్యల అమ్మకాలు సాగించారు. లాక్ డౌన్ నేపథ్యంలో జనాలు లేక తెచ్చిన సరకు అమ్ముడు పోక నష్టం వచ్చిందని మత్స్య మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు.
వాటికి బదులుగా చేపలు...
ప్రస్తుత గడ్డు కాలంలో చికెన్ , మటన్కు బదులుగా చేపలు, రొయ్యల ఆహారం తినాలని ప్రజలకు సూచించారు. చేపల్లో మాత్రమే ఉండే ప్రత్యేక పదార్థం ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్... రోగనిరోధక శక్తిని పెంచుతాయని మత్స్య మహిళలు తెలిపారు. చేపలు తినడం వల్ల కంటి చూపు సైతం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
కరోనా నేపథ్యంలో...
కరోనా నేపథ్యంలో తమకు సరైన ఉపాధి లేక గిట్టుబాటు రాక ఆర్థికంగా కుంగిపోతున్నామని సొసైటీ సభ్యురాలు సంగమేశ్వరి బెస్త ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇదే విధంగా కొనసాగితే తమకు పూట గడవడం కూడా కష్టమేనని వాపోయారు. ఈ సమస్య నుంచి తాము గట్టేక్కాలంటే మత్స మహిళా సొసైటీలకు ప్రభుత్వమే నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సొసైటీ ఉపధ్యక్షురాలు శోభ రాణి , సభ్యులు మన్నెమ్మ, శ్రీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.