హైదరాబాద్ పాతబస్తీ డబీర్పురాలో జరిగిన స్ట్రీట్ ఫైట్ ఘటనలో ఒకరు మృతి చెందిన కేసులో ఇద్దరు బాలకార్మికులతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్ వెల్లడించారు. నిందితులంతా 20 సంవత్సరాలలోపు వారేనని డీసీపీ స్పష్టం చేశారు. గత శనివారం కొంతమంది యువకులు గూమిగూడి పరస్పరం దాడి చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ దాడిలో కమ్రాన్ అనే యువకుడు అద్నామ్ అనే యువకుడిని బలంగా కొట్టగా అతను కుప్పకూలిపోయాడని డీసీపీ తెలిపారు.
ఈ ఘటనలో ముందుగా ఆరుగురు స్నేహితుల మధ్య గొడవ చోటుచేసుకోగా వీళ్లలో వీరికి తగాదా వచ్చి అద్నాన్ అనే యువకుడిని వేధించగా అది కాస్త పరస్పర దాడులకు దారి తీసిందని డీసీపీ వివరించారు. అద్నాన్ను మిగతా స్నేహితులు చేతకాని వాడవని అనడంతో ఈ తగాదా ముదిరి పరస్పర దాడులకు దారితీసిందన్నారు. ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి నిందితులను పట్టుకున్నామని పేర్కొన్నారు. సీసీ కెమెరాల దృశ్యాలను ప్రసారం చేయడంలో మీడియా సంయమనం పాటించాలని... ఇలాంటివి వైరల్ చేయడం సమాజానికి మంచిదికాదని తెలిపారు.