Data Theft Case Update: 67 కోట్ల మంది పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు భరద్వాజ్ను ఆరు రోజులు పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ డేటా చౌర్యం వ్యవహారంపై కేంద్రం కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 11 సంస్థలు ఫోన్పే, బిగ్ బాస్కెట్, పాలసీ బజార్, క్లబ్ మహీంద్ర, యాక్సిస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, అస్ట్యూట్ గ్రూపు, టెక్ మహీంద్ర తదితర సంస్థలకు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేసింది.
ఆయా సంస్థల నుంచి నిందితుడు భరద్వాజ్ డేటా ఏ విధంగా పొందాడు.. ఎలా చౌర్యం జరిగింది, ఇంటి దొంగలే ఆయా సంస్థల నుండి డేటా నిందితుడికి ఇచ్చారా..? అనే అంశాలపై సిట్ బృందం లోతుగా ఆరా తీస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో సంస్థల ప్రతినిధులను విచారించనుంది. దాదాపు 67 కోట్ల మంది డేటా చౌర్యం కేసులో హర్యానాకి చెందిన వినయ్ భరద్వాజ్ ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఒకే వ్యక్తి ఇంత పెద్దఎత్తున డేటా చౌర్యం చేయడం సాధ్యంకాదని సైబర్క్రైమ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కొందరి సమాచారాన్ని కొని.. మిగిలింది వివిధ వెబ్సైట్లు హ్యాక్చేసి: వివిధ వ్యక్తులు, అనేక మార్గాల ద్వారా డేటాను సేకరించి ఉండవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు భరద్వాజ్ గతంలో వెబ్ డిజైనర్గా పనిచేసేవాడు. భరద్వాజ్కి సాంకేతిక పరిజ్ఞానంపై పట్టున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కొందరు వ్యక్తుల నుంచి సమాచారం కొనుగోలు చేసి.. మిగిలింది వివిధ వెబ్సైట్లను హ్యాక్చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమాచారం కొట్టేసేందుకు అవకాశమున్న వెబ్సైట్లను గుర్తిస్తున్నారు. అయితే ఈ డేటా చౌర్యం కేసులో ఇప్పటికే 11 సంస్థలకు పోలీసులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. ఈ మేరకు రేపటి నుంచి మూడు రోజుల్లోగా ఆయాసంస్థలు వివరణ ఇవ్వాలని కోరింది. వివిధ సంస్థల నుంచి సమాచారం బయటకి రావడం లేదా.. ఉద్దేశపూర్వకంగా బయటవారికి విక్రయించినట్లు తెలితే ఏం చేయాలనే అంశంపై అధికారులు చర్చించినట్లు తెలిసింది. ఒకవేళ ఇది ఇంటి దొంగలపనైతే వారిని కూడా కేసులో నిందితులుగా చేరుస్తారు.
ఇవీ చదవండి: