భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్న తరుణంలో ఇంట్లో ఎవరికి చిన్న అనారోగ్యం వచ్చినా ఆందోళన నెలకొంటోంది. ముఖ్యంగా చిన్న పిల్లల్లో గొంతు నొప్పి, జ్వరం అంటే చాలు.. తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. వెంటనే వైద్యుల వద్దకు పరుగులు పెడుతున్నారు. అయితే ఈ సమస్యలు ఉన్నంత మాత్రాన కరోనాగా భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా జులై నుంచి ఫిబ్రవరి వరకు వానలకు తోడు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో పెద్దలతోపాటు పిల్లలు వైరల్, బ్యాక్టీరియా వ్యాధుల బారిన పడుతుంటారు. ముఖ్యంగా ఈ కాలంలో పిల్లలకు టాన్సిలైటిస్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ లక్షణాలు కొవిడ్కు దగ్గరగా ఉండటం వల్ల గుర్తించడం కష్టమవుతుంటుంది. 5 నుంచి 15 ఏళ్ల మధ్య చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా కన్పిస్తాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి వచ్చే వారిలో తరచూ 20-30 మందిలో ఈ లక్షణాలు బయట పడుతుంటాయి. తరచూ టాన్సిలైటిస్ పిల్లల్లో కన్పిస్తే అది ఇతర రుగ్మతలకు దారి తీస్తుంది. సరైన ఎదుగుదల లేకపోవడం, బరువు పెరగకపోవడం, నిద్ర లేమి, జ్వరం వంటి ఇబ్బందులు తరచూ వేధిస్తుంటాయి.
గొంతు భాగాన చివరిలో రెండు వైపులా ఉండే లింప్నోడ్స్ను టాన్సిల్స్గా వ్యవహరిస్తారు. నోటి ద్వారా ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్ను అడ్డుకునే ప్రాథమిక రక్షణ వ్యవస్థ ఇదే. తరచూ ఇలా వైరస్, బ్యాక్టీరియా బారిన పడటం వల్ల టాన్సిల్స్ కూడా ఇన్ఫెక్షన్కు గురై టాన్సిలైటిస్ వ్యాధికి దారి తీస్తుంది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో టాన్సిల్స్పై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నగరంలో చాలామంది పిల్లల్లో ఈ వ్యాధి కన్పిస్తోందని తెలిపారు. తల్లిదండ్రులు అవగాహనతో ఉండటం వల్ల పిల్లలకు వ్యాధి సోకకుండా చూడవచ్చునన్నారు.
ఈ లక్షణాలు గుర్తించాలి
* కొవిడ్ మాదిరిగానే టాన్సిలైటిస్లో లక్షణాలు కన్పిస్తాయి. గొంతునొప్పి, జ్వరం ఎక్కువగా ఉంటాయి. మెడ వద్ద వాపు, గొంతులో మంట, గొంతు బొంగురు పోవడం, నోటి దుర్వాసన, మెడ ఇటు అటు తిప్పలేకపోవడం వంటివి ఉంటాయి. ఆకలి లేక ఏమీ తినలేరు.
* కొంతమంది చిన్నారుల్లో డిప్తీరియా కారణం లేదంటే ఇతర వ్యాధుల వల్ల కూడా టాన్సిలైటిస్ లక్షణాలు కన్పిస్తాయి. చల్లని పదార్థాలు, ఐస్క్రీంలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొందరు పిల్లల్లో సమస్య వస్తుంది.
* 10-15 రోజులు నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరంగా మారి శస్త్ర చికిత్స వరకు దారి తీసే ముప్పు ఉంది. లక్షణాలు కన్పించిన వెంటనే వైద్యులను సంప్రదించి మందులు తీసుకుంటే తగ్గిపోతుంది.
* పిల్లలు అడుకునే సమయంలో చేతి ద్వారా వైరస్, బ్యాక్టీరియా నోట్లోకి చేరే ప్రమాదం ఉంది. తరచూ చేతి శుభ్రతపై అవగాహన కల్పించాలి.
"ఈ కాలంలో కాచి చల్లార్చి వడబోసిన నీరు తరచూ తీసుకోవడం, గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించడం వల్ల టాన్సిలైటిస్ మాత్రమే కాకుండా..కొవిడ్ బారిన కూడా పడకుండా కాపాడవచ్చు".
-డాక్టర్ సయ్యద్ అబ్దుల్ హకీం, కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్
ఇదీ చదవండి: భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం