ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యువతే కీలకం. ఈ క్రమంలో ప్రస్తుతం కొవిడ్-19 వైరస్ను జయించేందుకు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలంతా.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం సహా వయసుతో నిమిత్తం లేకుండా యోగా, వ్యాయామం చేస్తున్నారు. ఆగస్ట్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాయామశాలలు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ వ్యాయామశాలలు తెరుకున్నాయి. వ్యాయామశాలలకు వచ్చే వారి చేతులకు శానిటైజేషన్ చేయడంతో పాటు, థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలను సైతం నిర్వహిస్తున్నారు.
ఎక్కడ కరోనా సోకుతుందోనని...
అయినప్పటికీ.. వ్యాయామశాలలకు వెళ్తే... ఎక్కడ కరోనా సోకుతుందో అని చాలా మంది భయపడిపోతున్నారు. ఫలితంగా జిమ్లు తెరిచినప్పటికీ... వెలవెలాబోతున్నాయని నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో వ్యాయామశాలలకు వచ్చే వారితో పోల్చితే... ప్రస్తుతం కేవలం 20శాతం మంది మాత్రమే వస్తున్నారని పేర్కొంటున్నారు. కరోనా నేపథ్యంలో ఒకరు ముట్టుకున్న వస్తువులను మరొకరు పట్టుకోవాలంటేనే జంకుతున్నారు.
సుమారు 40వేల మందికి ఉపాధి..
గ్రేటర్ పరిధిలో సుమారు 10వేల వరకు వ్యాయామశాలలు ఉన్నాయి. వీటిపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 40వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. కోచ్లు, ట్రైనర్లు, కొన్ని పెద్ద జిమ్లలో హెచ్ఆర్ కూడా ఉంటారు. ఈ జిమ్లు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. బల్దియా పరిధిలో ఇటువంటివి సుమారు 10 నుంచి 15 వరకు ఉంటాయని వ్యాయామశాలల నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
వారికి అందుబాటులో వెయ్యి జిమ్లు...
మధ్య తరగతి వారికీ సుమారు వెయ్యికిపైగా జిమ్లు అందుబాటులో ఉన్నాయని... మిగిలిన జిమ్లు కొంత తక్కువ ధరలోనే ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వచ్చేవారిలో భయం మాత్రం పోవడంలేదని నిర్వాహకులు అంటున్నారు. ప్రతి గంటకొకసారి తమ జిమ్ను శానిటైజేషన్ చేస్తున్నామని.. వస్తువులను కూడా శానిటైజేషన్ చేస్తున్నా.. వ్యాయామం చేసేందుకు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారని వాపోతున్నారు. ఫలితంగా అద్దెలు కట్టడం భారమైపోతుందని స్పష్టం చేశారు. దీనికితోడు శానిటైజేషన్ నిర్వహణ ఖర్చులు అదనపు భారంగా మారిపోయాయంటున్నారు.
ఇంట్లో వ్యాయామానికే ఆసక్తి...
ఎక్కువ శాతం ప్రజలు ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడంపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యాయమం చేసే వస్తువులు కొనుగోలు చేసే వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఆ షాపులన్నీ కొనుగోలుదారులతో కళకళలాడుతున్నాయి. ఇక వ్యాయామశాలలకు సంబంధించిన వస్తువులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వస్తుందని.. అవి తక్కువ మోతాదులో ఉండటం వల్ల ధరలు కూడా పెరిగిపోయాయని వివరించారు.
ఇప్పుడు కిలోకు ధర పెరిగింది...
జిమ్ చేసేందుకు వినియోగించే పరికరాలు డంబెల్స్, బరువులు మోసేవి కిలోల చొప్పున విక్రయిస్తారు. గతంలో వీటికి కిలోకు రూ.80 చొప్పున విక్రయించే వారు. కానీ.. అవి ప్రస్తుతం సరిపడినన్ని లేకపోవడంతో కిలోకు రూ.120 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. అయినప్పటికీ.. చాలామంది వ్యాయామ వస్తువులను కొనుగోలు చేసి వాటిని ఇంట్లోనే వినియోగించుకునేందుకు ఇష్టపడుతున్నాని అమ్మకందారులు చెబుతున్నారు.
ఎక్కువగా అవే కొంటున్నారు...
కొందరు నేరుగా వచ్చి షాపుల్లో కొనుగోలు చేస్తే మరికొందరు ఆన్లైన్లో వీటిని కొనుగోలు చేస్తున్నారన్నారు. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని స్పోర్ట్స్ షాపుల నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఎక్కువగా బరువు తగ్గేందుకు వినియోగించే సైకిళ్లు, థ్రెడ్ మిల్స్, పొట్ట తగ్గించుకునేందుకు వినియోగించే పరికరాలు, డంబెల్స్ కొనుగోలు చేస్తున్నారు.
'భయంపోతేనే జిమ్కు వస్తారు'
మరికొన్ని నెలల వరకు వ్యాయామశాలలకు వచ్చే వారి సంఖ్య ఇలాగే ఉంటుందని జిమ్ నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. వారిలో ఉన్న భయంపోతే... తిరిగి వ్యాయామశాలలకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుందంటున్నారు.
ఇవీ చూడండి : సుప్రీం తీర్పు తర్వాతే డిగ్రీ, ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ!