టర్మరిక్ మిల్క్షేక్, అల్లంతో చేసిన కాపచ్చినో అంటూ కొందరు వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రొ చోలే రాప్, ప్రొటీన్ ప్యాక్డ్ చికెన్ స్టీక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న షాబుదానా వడను మెనూలో జత చేసామంటూ మరికొన్ని రెస్టారెంట్లు ప్రచారం చేస్తున్నాయి. అల్లం, ఓట్స్, దాల్చినచెక్క, తులసి, ఉసిరి, పసుపుల మిశ్రమంతో చేసిన మిఠాయిలు సిద్ధం చేశామంటూ ఇంకొందరు ప్రచారం చేస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లోని ప్రముఖ రెస్టారెంట్లు ‘హెల్తీ ప్లేట్ మెనూ’ పేరుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్మూథీల విక్రయదారులు సైతం ఈ పంథానే ఎంచుకుంటున్నారు. అవకాడో, పాలకూరలతో తయారుచేస్తున్న స్మూథీలను మెనూలో పెట్టినట్లు చెబుతున్నారు.
చితికిన చిరు బతుకులు
అందమైన చార్మినార్ రూపం.. ఆకట్టుకునే పాతబస్తీ ప్రజల జీవన విధానం.. రాత్రి 12గంటలకు వరకు సందర్శకుల తాకిడి.. ఊరించే వంటకాలు ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకా ఎన్నో.. అయితే కరోనా ప్రభావంతో పాతబస్తీలో ఈ సందడి మాయమైంది. నాలుగు నెలలుగా చిరువ్యాపారులు, హస్త కళాకారుల జీవితాలు తలకిందులయ్యాయి. గాజులు, జర్దోసీ (ఎంబ్రాయిడరీ), వార్క్ (సిల్వర్ ఫాయిల్), అగర్బత్తి, ఆభరణాలు, విగ్రహాల తయారీ రంగాలపైనే వేలాదిమంది ఆధారపడి జీవిస్తున్నారు. స్థానికులు, వలస వచ్చిన చిరు వ్యాపారులు 7000-8000 మంది ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల పస్తులతో గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![](https://assets.eenadu.net/article_img/2-1.jpg)
బతుకులు ఆగమయ్యాయి...
‘డిమాండ్ మీదనే ఆధారపడే వ్యాపారం మాది. రంజాన్కు ముందు, తర్వాత చేతినిండా పని దొరికేది. లాక్డౌన్తో గిరాకీ దెబ్బతింది. సడలింపుల తర్వాత 15 రోజులు మళ్లీ దుకాణాలు మూసేశాం. ఇప్పుడిప్పుడే తెరుస్తున్నాం. ఎవ్వరూ కొనుగోలుకు రావడం లేదు’.. అని చిరు వ్యాపారి నిజాముద్దీన్ తెలిపారు. ‘3 నెలలుగా ఖాళీ. తాజాగా పనుల్లోకి వచ్చాం. డిమాండ్ లేక సిల్వర్ ఫాయిల్ వ్యాపారం అంతంతమాత్రంగానే ఉంది. గతంలో రోజుకు రూ.600 సంపాదించేవాళ్లం. ఇప్పుడు రూ.400 వస్తున్నాయి.’ అని కార్మికుడు అహ్మద్ తెలిపారు.
గృహమే కదా వ్యాయామశాల
ప్రస్తుతం నగర జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉదయం వేళల్లో వ్యాయామం తప్పనిసరిగా చేసేవారికి జిమ్లు ఇంకా తెరవకపోవడం, వైరస్ వ్యాప్తి ఇబ్బందికరంగా మారింది. బరువు పెరగడం, శరీరం వదులుగా తయారవడం, పొట్ట పెరగడం, చురుకుదనం తగ్గిపోవడం తదితర సమస్యలను అనేకమంది ఎదుర్కొంటున్నారు. తమకు అనువుగా ఉండే వ్యాయామ పరికరాలను ఇంట్లోనే ఏర్పాటు చేసుకుని కసరత్తులు చేస్తున్నారు.
![](https://assets.eenadu.net/article_img/BESTDUMBBELLS_PRIMARY.jpg)
చిన్న పరికరాలకే ఎక్కువ గిరాకీ
జిమ్లో కనిపించే భారీ పరిమాణంలో ఉన్నవాటికంటే చిన్న పరికరాలనే ఎక్కువమంది కొనుగోలు చేస్తున్నారు. సులువుగా వర్కవుట్స్ చేసేలా ఉన్నవి.. కెటిల్ బెల్స్, బెంచెస్, డంబెల్స్, బాల్, మ్యాట్లు, రాడ్లు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. ఇంట్లో మ్యూజిక్ సిస్టమ్ పెట్టుకుంటున్నారు. ఫిట్నెస్ శిక్షకుల సలహాలు తీసుకుంటున్నారు. చక్కటి వెలుతురు, స్వచ్ఛమైన గాలి వచ్చే గదులను ఎంచుకుని సాధన చేస్తున్నారు. ఇంకొందరు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. అరుణ్కుమార్ అనే వ్యాయామశాల నిర్వాహకుడు మాట్లాడుతూ ‘గత 4 నెలల్లో పరికరాల విక్రయాలు మూడు రెట్లు పెరిగాయి. ఎఫ్ఐడీ బెంచెస్ వంటివి ఎక్కువగా కావాలంటున్నారు. రూ.25-30 వేల వరకు ఖర్చుపెట్టి కిటలు కొనుగోలు చేస్తున్నారు.’ అని తెలిపారు.
మాస్క్ ధారణ.. మహమ్మారి సంహరణ
గ్రేటర్ పరిధిలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్ కేసుల్లో అధికశాతం బస్తీలు, కాలనీల నుంచే. మాస్క్ ధరించాలని తెలిసినా అవగాహన లోపం, ఆర్థికభారంగా భావించటం వల్ల కొందరు పాటించడం లేదు. మహానగరిలో 1400 మురికివాడలు ఉన్నట్టు అంచనా. నగర జనాభాలో సుమారు 35 శాతం ఇక్కడే నివసిస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు లాక్డౌన్ సమయంలో సరకులు, ఆహారపదార్థాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఇప్పుడు అవే చేతులు మాస్క్లు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.
![](https://assets.eenadu.net/article_img/Untitled-3_487.jpg)
సవాల్ స్వీకరిద్దాం.. ఆరోగ్యాన్ని పంచుదాం
నగరానికి చెందిన డిగ్నిటీ డ్రైవ్ స్వచ్ఛంద సంస్థ రాబిన్హుడ్ ఆర్మీ హైదరాబాద్ విభాగంతో కలసి మాస్క్లు, మహిళలకు చేతి రుమాళ్లు పంపిణీ చేయనుంది. వ్యక్తిగత పరిశుభ్రతపైనా అవగాహన కల్పించనున్నట్టు సంస్థ వ్యవస్థాపకురాలు రీనా గ్రేస్ తెలిపారు. నగరవ్యాప్తంగా ‘మాస్క్ అప్ ఛాలెంజ్’కు పిలుపునిచ్చారు. యువజనులు, ఐటీ, ఉద్యోగ వర్గాల నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. రాబిన్హుడ్ ఆర్మీ సమన్వయంతో బస్తీల్లో మాస్క్లు అందజేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి:- రాజధానిలో రోజువారీ కేసుల కన్నా రికవరీలే ఎక్కువ!