అవి పేరుకే.. పెద్దాసుపత్రులు. పెద్ద పెద్ద బిల్డింగులు.. నాణ్యమైన వైద్యం అందించే ఆరోగ్య కేంద్రాలు. కానీ.. ఆ ఆస్పత్రుల యాజమాన్యాల మనసులు మాత్రం పూర్తిగా వ్యాపారానికి అలవాటు పడ్డాయి. కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్రంలో కార్పోరేటు, ప్రైవేటు ఆస్పత్రులు కరోనాతో జతకట్టి.. కరోనా బాధితుల నుంచి లక్షల రూపాయల బిల్లు వసూలు చేస్తున్నాయి. అసలు మందే లేని రోగానికి లక్షలు వసూలు చేస్తూ.. శవాలతో వ్యాపారం చేస్తూ.. బాధితుల కుటుంబాల కన్నీటికి కారణమవుతున్నాయి.
హైదరాబాద్లోని మూసాపేట్కు చెందిన మోహన్ బాబు అనే వ్యక్తి జులై 14న కరోనా పాజిటివ్ రాగా.. చికిత్స కోసం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. అప్పటికప్పుడు చికిత్స మొదలుపెట్టడానికి రూ.2 లక్షలు ఆస్పత్రి సిబ్బందికి కట్టారు. మరుసటి రోజు.. తెల్లవారు జామున బాధితుడు ఊపిరి అందక ప్రాణాలు కోల్పోయాడు. ఇదే విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది మృతుడి కుటుంబీకులకు చెప్పారు. మృతదేహాన్ని తీసుకెళ్దామని వారు ప్రయత్నించగా.. ఆస్పత్రి బిల్లు మరో రూ.6 లక్షలు చెల్లిస్తేనే.. మృతదేహాన్ని ఇస్తామని సిబ్బంది కరాఖండిగా చెప్పారు.
మృతుడి కుటుంబీకులు ఎంత బతిమిలాడినా వారు మృతదేహాన్ని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. మొత్తం డబ్బు కట్టలేమని.. ఎంతో కొంత కడతాం.. మృతదేహాన్ని ఇవ్వాలని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది పూర్తి బిల్లు కట్టి మృతదేహాన్ని తీసుకుపోవాలని చెప్పారు. దిక్కు తోచని స్థితిలో బాధితులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఎవరైనా స్పందించి మృతదేహాన్ని ఇప్పిస్తే.. చివరిచూపు చూసుకుంటామని కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?