హైదరాబాద్ నగరంలోని బాలానగర్ పై వంతెన నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. రెండున్నర నెలల్లో జరగాల్సిన పనులు లాక్డౌన్ సమయంలో నెల రోజుల్లోనే పూర్తయినట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. 24 మీటర్ల వెడల్పుతో 1.13 కిలోమీటర్ల మేరకు ఆరు లేన్లుగా ఈ పై వంతెనను నిర్మిస్తున్నారు. రూ. 387 కోట్ల అంచనా వ్యయంతో బ్రిడ్జికి సంబంధించి రూ.122 కోట్లు నిర్మాణ పనులకు, రూ. 265 కోట్లు ఆస్తుల సేకరణకు కేటాయించారు. ప్రస్తుతం 30 మీటర్ల వెడల్పు కలిగిన ఈ మార్గాన్ని 45 మీటర్ల మేరకు విస్తరించడంతో పాటు 24 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
బాలానగర్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి వీలుగా జీహెచ్ఎంసీ 357 చోట్ల భూసేకరణ ప్రక్రియలో భాగంగా భవన నిర్మాణాలు కూల్చివేసింది. ఇప్పటికే ఫౌండేషన్ వర్స్క్, పిల్లర్ల పనులు పూర్తిచేసిన ఇంజినీరింగ్ అధికారులు ఇక స్లాబు, ర్యాంపులపై దృష్టిసారించారు. ఆగస్టు చివరి నాటికల్లా బాలాగనర్ పై వంతెన నగర వాసులకు అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా పనులు వేగవంతం చేస్తున్నమని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: ప్రాణాలు తీసే కంపెనీ మాకొద్దు: ఆర్ఆర్ వెంటాపురం గ్రామస్థులు