Congress on GO 111: హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే చెరువుల పరివాహక ప్రాంత పరిరక్షణకు తీసుకొచ్చిన 111 జీవో రద్దు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ఉద్యమించాలని కాంగ్రెస్ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇవాళ మధ్యాహ్నం జరిగిన జూమ్ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక చౌదరి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల పరివాహ ప్రాంతం పరిధిలోకి వచ్చే పూర్వ రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో కలిసి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అదేవిధంగా నిపుణులతో కమిటీ వేసి ఈ 111 జీవోపై అధ్యయనం చేయించి వాస్తవ పరిస్థితులపై ఓ నివేదిక తెప్పించుకుని ఉద్యమం చేయాల్సి ఉందని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై ఆయన వివరించారు. అదేవిధంగా ఈ సమావేశంలో 111జీవో, విద్యుత్తు ఛార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు సమస్య, దళిత బంధు ఈ నాలుగు 4 అంశాలపై సభ్యులంతా చర్చించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల పెంపుతో సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.45వేల కోట్లకుపైగా మొత్తం డిస్కమ్లకు అప్పులు చెల్లించకపోవడంతోనే నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు.
సకాలంలో రాయితీకి చెందిన, ప్రాజెక్టులకు ఉపయోగిస్తున్న విద్యుత్ ఛార్జీలను చెల్లించకుండా.. ఛార్జీలను పెంచి పేద, మధ్యతరగతి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపు పేదలకు గుదిబండగా మారిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఛార్జీలు పెంచుతూ ఒకరిపై ఒకరు పోరాటాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రజలను కూడా భాగస్వాములను చేస్తూ క్రియాశీల ఉద్యమాలను చేయాలని, ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ధరలు, ఇప్పటి ధరలు తెలియజేసి వారిలో చైతన్యం తీసుకురావాల్సి ఉందని కోదండరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: