హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు ఉత్తమ్ తెలిపారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. భారత్ బచావో తరహాలో తెలంగాణ బచావో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21 నుంచి 27 వరకు తెరాస ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఉత్తమ్కమార్ రెడ్డి వెల్లడించారు.
ఈ నెల 28న ఫ్లాగ్ మార్చ్
ఈ సమావేశంలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం, మద్యం నియంత్రణ, మున్సిపల్ ఎన్నికలు, అధికార పార్టీ వైఫల్యాలు, తెరాస హామీలపై చర్చించామన్నారు. ఈ నెల 28న కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని.. 'దేశాన్ని రక్షించండి.. రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాలని ఏఐసీసీ ఆదేశించినట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. భాజపా ప్రభుత్వం తమ వైఫల్యాలను దృష్టి మళ్లించడానికే పౌరసత్వ సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు.