సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్లో కరోనా నిర్ధారణ పరీక్షల కోసం వచ్చిన ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులను అక్కడి స్థానికులు పరీక్షలు చేయించుకోనివ్వకుండా వెళ్లగొట్టారు. మచ్చ బొల్లారంలోని ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు చేయించుకోమని కరోనా సోకిన వారితో సన్నిహితంగా ఉన్న ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులకు అధికారులు సూచించారు. ఈ మేరకు అనుమానితులు, ప్రైమరీ కాంటాక్టు ఉన్న వాళ్ళు మచ్చబొల్లారం ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానిక కాలనీవాసులు ఇక్కడ కరోనా టెస్టులు చేయడానికి వీలులేదని వారిని అడ్డగించి స్థానిక ఆరోగ్య కేంద్రానికి తాళాలు వేశారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇక్కడ కరోనా పరీక్ష కేంద్రాన్ని పెట్టడం మూలంగా తమకు వైరస్ సోకే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరీక్షల కోసం వచ్చిన వారు సైతం.. పరీక్షలు చేయించుకొని వెళ్తామని పట్టుబట్టడం వల్ల కొద్దిసేపు కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
అధికారులు తమను ఇక్కడికి పంపారని వారు చెబుతున్నప్పటికీ వినకుండా వారిని బెదిరించి అక్కడి నుండి పంపించి వేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం పది గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు బాధితులు తెలిపారు. అధికారులు అనుమతి ఇచ్చినప్పటికీ స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నారు. కరోనాతో బాధపడుతున్న తన భర్తకు కరోనా నిర్ధారణ ఐదు రోజులు అయిందని, జీహెచ్ఎంసీ అధికారులు పంపడం వల్లనే పరీక్షల కోసం వచ్చామని.. స్థానికులు అడ్డుకోవడం వల్ల నిస్సహాయంగా వెనుదిరిగినట్టుబాధితురాలు తెలిపింది. ప్రభుత్వం తమకు భద్రత కల్పించి కరోనా టెస్టులు నిర్వహించాలని ఆమె కోరారు. ఇప్పటికీ తమ ఇళ్లలోని వారికి కరోనా నిర్ధారణ చాలారోజులైందని.. తమకు కూడా సోకిందేమో అన్న భయంతో బతుకుతున్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి.. పరీక్షలు చేసి.. చికిత్సకు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నరకయాతన: అద్దె ఇళ్లలో ఉండనివ్వరు.. దవాఖానాల్లో చేర్చుకోరు!