గౌతమ బుద్ధుని జయంతి, బుద్ధ పూర్ణిమ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మానవాళి ప్రగతి కోసం.. బౌద్ధం చూపిన బాట నేటికీ ఆచరణీయమని సీఎం అన్నారు. తెలంగాణ సమాజపు మానవత్వ పరిమళాలు, శాంతి, సహనంతో కూడిన అహింసాయుత జీవన విధానం, అందులోని మూలాలు బౌద్ధ వారసత్వం నుంచే అలవడ్డాయని తెలిపారు.
ఫణిగిరి వంటి బౌద్ధారామాల్లో బయల్పడుతున్న అరుదైన బౌద్ధ చారిత్రక సంపద.. తెలంగాణలో బౌద్ధం పరిఢవిల్లిందనేందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయని సీఎం అన్నారు. నాగార్జున సాగర్లో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది చేస్తున్న బుద్ధవనం అంతర్జాతీయ బౌద్ధకేంద్రంగా రూపుదిద్దుకుంటోందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని బౌద్ధ వారసత్వ కేంద్రాలను పునరుద్ధరిస్తామని... ప్రపంచ బౌద్దపటంలో తెలంగాణకు సముచితస్థానాన్ని కల్పించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజా సంక్షేమం, ప్రగతి కోసం పాటుపడడమే భగవాన్ గౌతమబుద్ధునికి నిజమైన నివాళి అర్పించినట్లని తెలిపారు. ఆ దిశగానే తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు.
ఇదీ చూడండి: పల్లెల్లో కరోనా కల్లోలం.. వైరస్ ఉద్ధృతికి కారణాలివే..!