జిల్లా స్థాయి వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నా సీఎం... వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం విషయంలో రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను విడమర్చి చెప్పారు.
కనీవినీ ఎరుగని విజయాలు...
అమెరికా, చైనా, రష్యా, జపాన్, ఇజ్రాయిల్ లాంటి దేశాల్లోని విజయగాథలను ఇంతవరకు విన్నామని... కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా తెలంగాణ రాష్ట్రమే కనీవినీ ఎరుగని ఎన్నో అద్భుత విజయాలు సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. మిషన్ భగీరథ, 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్, రెవెన్యూలో అత్యంత జటిలమైన సమస్యల పరిష్కారం, ధరణి ద్వారా వ్యవసాయ భూములు రికార్డుల నిర్వహణ- రిజిస్ట్రేషన్లు, పల్లె ప్రగతి ఇలా ప్రతి రంగంలోనూ రాష్ట్రం ఎన్నో అద్భుత విజయాలు సాధించిందని కేసీఆర్ అన్నారు.
విప్లవాత్మక మార్పులు...
అదే తరహాలో వ్యవసాయరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాడు ఏడాదికి కేవలం 35 లక్షల టన్నుల ధాన్యం మాత్రమే పండించేవారని, కానీ నేడు కోటి పది లక్షల టన్నుల ధాన్యం రాష్ట్రంలో పండిస్తున్నామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల కోటీ పాతిక లక్షల ఎకరాలకు సాగునీరు అందించుకుంటామని, బోర్ల ద్వారా మరో 40 లక్షల ఎకరాలకు పైగా నీరు వస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు.
వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ...
ఏడాదికి నాలుగో కోట్ల టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే గొప్ప వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందుతోందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలన్న సీఎం... వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు.
వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయశాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు పండించిన పంటలను మార్కెట్లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంభించే బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
పంట మార్పిడి విధానం...
రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోయి పంట మార్పిడి విధానం రావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయని అన్నారు. పంటల సాగులో ఆధునిక పద్ధతులు రావాల్సిన అవసరం ఉందన్న సీఎం... ఈ అంశాలపై రైతులకు వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 2,600 క్లస్టర్లలో నిర్మించిన రైతువేదికలను వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చి రైతులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.
రైతువేదికల్లోనే...
పంటల సాగు, పంటల మార్పిడి, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఏఈఓ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలని... మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు.
ఏ క్లస్టర్లో ఐనా ఏ కారణం చేతనైనా ఏఈఓ పోస్టు ఖాళీ అయినా, ఎవరైనా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలని కేసీఆర్ స్పష్టం చేశారు. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించి ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలని అన్నారు.
మార్కెట్లే వేదిక...
రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదికన్న సీఎం కేసీఆర్... రాష్ట్రంలో మార్కెట్లను కొనసాగిస్తామని తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాల అమలు కారణంగా మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తుందన్నారు. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానాన్ని తీసుకురావాలని... ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలని సూచించారు.
అనాలసిస్ వింగ్...
ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలన్న ముఖ్యమంత్రి... ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తోంది, అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉందన్న వివరాలు సేకరించాలని చెప్పారు. మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలని సీఎం సూచించారు.
ఇజ్రాయిల్ పర్యటన...
సాగులో యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం రాయితీలు అందిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేసేందుకు వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ పర్యటించాలని సీఎం చెప్పారు.
ప్రాసెసింగ్ యూనిట్లు...
పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని... వాటిని పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుందని తెలిపారు. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ఆయన... ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలన్నారు. వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.