దేశంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోందని... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా.. లాక్డౌన్ సత్ఫలితాలు ఇస్తోందన్నారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశమే.. కరోనా మహమ్మారికి వణికిపోతుందని ఆయన తెలిపారు.
సర్వే ప్రకారం జూన్ 3 వరకు..
ఆయా దేశాలతో పోలిస్తే మనదేశంలో పరిస్థితి అదుపులో ఉందని.. సీఎం వివరించారు. లాక్డౌన్ను ఎవరూ శిక్షగా భావించొద్దని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయం తీసుకున్నాయన్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్.. బీసీజీ భారత్లో జూన్ 3 వరకు లాక్డౌన్ కొనసాగించాలని అభిప్రాయపడిందని.. ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
లాక్డౌనే సరైన ఆయుధం..
ఏప్రిల్లో ఈ సమయానికి రూ. 2వేల 400 కోట్లు రాష్ట్రానికి ఆదాయం సమకూరాలని.. వాస్తవానికి ఇప్పటి వరకు రూ. 6 కోట్లు మాత్రమే వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధానితో రోజుకు రెండుసార్లు మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయన్న సీఎం.. ఆహార నిల్వలు, ఆర్థిక స్థితి, ప్రస్తుత పరిస్థితిని ఎలా అధిగమించాలనే చర్చలు జరుగుతున్నాయన్నారు. కరోనా నియంత్రణకు లాక్డౌనే సరైన ఆయుధమని.. దీన్ని కొనసాగించాలని ప్రధానికి సైతం తెలిపానని కేసీఆర్ వెల్లడించారు.
లాక్డౌన్తో కరోనాను పూర్తి స్థాయిలో కట్టడి చేయవచ్చని... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆర్థిక పరిస్థితులను సైతం కూడా లెక్క చేయకుండా... ప్రాణాలకే విలువ ఇవ్వాలన్నారు.
ఇవీచూడండి: 'దేశంలో కరోనా కేసులు, మృతుల్లో పురుషులే అధికం'