CBN Letter to DGP on Vangaveeti: వంగవీటి రాధ హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరిపించాలని డీజీపీకి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధకి ఏం జరిగినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని చంద్రబాబు మండిపడ్డారు. బెదిరింపులు, గూండారాజ్ పరంపరలో భాగంగా తెదేపా నేత వంగవీటి రాధాను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. ఇలాంటి చట్టవ్యతిరేక చర్యలు ఆటవిక పాలనను తలపిస్తున్నాయని చంద్రబాబు ఆక్షేపించారు. హింసాత్మక ఘటనలపై తీవ్రమైన చర్యలు లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పదే పదే పునరావృతమవుతున్నాయని వాపోయారు. నేరస్థులపై సమగ్ర విచారణ తర్వాత కఠినమైన చర్యలు మాత్రమే రాష్ట్రంలో ప్రాథమిక హక్కులను కాపాడతాయని స్పష్టం చేశారు.
![CBN Letter to DGP on Vangaveeti](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14037565_letter.jpg)
వంగవీటి రాధకు చంద్రబాబు ఫోన్...
వంగవీటి రాధకు తెదేపా అధినేత చంద్రబాబ్ ఫోన్ చేసి పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆరా తీశారు. గన్మెన్లను తిరస్కరించడం సరికాదని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భద్రత విషయంలో అశ్రద్ధ వద్దని హెచ్చరించారు. రాధకు తెదేపా పూర్తి అండగా నిలుస్తుందని చంద్రబాబు వివరించారు. అలాగే కుట్ర రాజకీయాలపై పార్టీపరంగా పోరాడదామని సూచించారు.
ఇదీ చూడండి: CM KCR Nalgonda Visit: నేడు నల్గొండకు సీఎం కేసీఆర్..