వరద సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. వరదలు వస్తే కేంద్రం సహాయం చేయలేదని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, మంత్రులు అనడం అబద్ధమన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చొరవతో జాతీయ విపత్తు కింద 205 కోట్లు, రహదారుల మరమ్మతుల కోసం 222 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. వరదలపై ప్రధానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. దిల్లీలో తెరాస కార్యాలయ భూమి కోసం పెట్టిన శ్రద్ధ నిధులు తేవడంలో పెట్టలేదని విమర్శించారు. వరద వల్ల ప్రజలు పూర్తిగా నష్టపోయారని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వకుండా.. కేవలం పది వేల రూపాయల ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. అది కూడా అసలైన లబ్ధిదారులకు కాకుండా తెరాస కనుసన్నల్లోనే ఉన్నవారికి పది వేలు ఆర్థిక సహాయం చేశారని ఆరోపించారు.
ప్రధాని మంత్రి ఆవాస్ యోజనను పక్కన పెట్టి డబుల్ బెడ్రూం అంటూ అబద్ధాలు చెపుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి పేరు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ప్రభాకర్ ఆరోపించారు. వీటన్నింటినిపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.
ఇవీ చూడండి: వరద సాయంపై ప్రధానికి లేఖరాసినా స్పందించలేదు: కేటీఆర్