కేంద్ర వైఖరికి నిరసనగా తెరాస చేస్తున్న కార్యక్రమాలే వేదికలుగా.. పార్టీలో అక్కడక్కడ ఉన్న లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేతల మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. కొత్తగూడెంలో తెరాస శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తనకు అవమానం జరిగిందంటూ.. మున్సిపల్ ఛైర్పర్సన్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ర్యాలీ జరుగుతున్న క్రమంలో పార్టీలోని మహిళా కౌన్సిలర్ల భర్తలు... అకతాయిల్లా ప్రవర్తించారని మున్సిపల్ ఛైర్పర్సన్ సీతాలక్ష్మి కంటతడి పెట్టుకున్నారు. తాను ప్రయాణిస్తున్న బైక్ను పలుమార్లు ఢీకొట్టారని తెలిపారు. బైక్కు దగ్గరగా వస్తూ.. పలుమార్లు ఢీకొనటం వల్ల తన చీర జారిపోయినంతపనైందని వాపోయారు. తనకు కలుగుతున్న ఇబ్బందిని చెప్తున్నా పట్టించుకోకుండా.. మొండిగా ప్రవర్తించారని కన్నీటి పర్యంతమయ్యారు.
సదరు నేతలు చేసిన చర్యతో తీవ్ర ఇబ్బంది పడ్డ ఛైర్ పర్సన్ వెంటనే బైక్ ర్యాలీ ఆపి.. సమీపంలో ఉన్న ఇంటికి వెళ్లి చీర సరి చేసుకున్నారు. తిరిగి వచ్చి నేతల ప్రవర్తనకు నిరసనగా.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తనను అగౌరవపరిచేలా ప్రవర్తించారని.. బాధ్యులపై చర్య తీసుకోవాలని సీతాలక్ష్మి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఛైర్పర్సన్ కన్నీరు పెట్టుకోవటంతో.. కార్యకర్తలు బాధ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా.. లాభం లేకపోయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. సీతాలక్ష్మికి సర్దిచెప్పి ఇంటికి తీసుకెళ్లారు.
ఇంటికి వెళ్లిన తర్వాత.. జరిగిన ఘటన గురించి సీతాలక్ష్మిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. తనకు జరిగిన అవమానాన్ని వివరంగా వెల్లడించిన మున్సిపల్ ఛైర్పర్సన్.. కన్నీటి పర్యంతమయ్యారు. తనకు అడుగడుగునా ఇలాంటి అవమానాలే ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే ముందు గోడు వెల్లబోసుకున్నారు. ఇకపై తాను ఎలాంటి కార్యక్రమాలకు హాజరవబోనని.. విలపించారు. మున్సిపల్ ఛైర్పర్సన్ గోడు విన్న ఎమ్మెల్యే.. బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నేతలకు బుద్ధి చెప్తామని.. భరోసా ఇచ్చారు. తనకు పార్టీ అండగా ఉంటుందని.. ఎలాంటి కుంగుబాటుకు లోనుకావొద్దని ధైర్యం చెప్పారు.
ఇదీ చూడండి: