ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 10 శాసనసభ స్థానాలుంటే 11 మున్సిపాల్టీలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రగతి నేపథ్యంలో ఆక్రమణల అంశం ఎమ్మెల్యేలను కలవరపెడుతోంది. ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, అక్రమ లేఅవుట్లు, అక్రమ కట్టడాల విషయంలో ఆషామాషీగా వ్యవహరిస్తే.. ఎమ్మెల్యేలను సైతం ఉపేక్షించమని సీఎం హెచ్చరించడం సవాల్గా మారింది.
ఆక్రమణలకు కేంద్రబిందువు
ఆదిలాబాద్లో దాదాపుగా 90కిపైగా అక్రమ లేఅవుట్లు ఉన్నట్లు అధికార యంత్రాంగమే నిర్ధరించింది. మరో 42 లీజు స్థలాలు అన్యాక్రాంతమై ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి పొందిన నిర్మల్ మున్సిపాలిటీ... ఇప్పుడు ఆక్రమణలకు కేంద్రబిందువుగా నిలుస్తోంది. గతంలో వీటి విషయంలో కొందరు అధికారులు కఠినంగా వ్యవహరించినా... ప్రజాప్రతినిధుల జోక్యంతో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రస్తుతం సీఎం ఆదేశాలతో ప్రజా ప్రతినిధులే అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆక్రమణలను అరికట్టేదెలా..?
రాజకీయంగా ఎప్పుడూ వివాదస్పదంగా ఉండే భైంసా పరిధిలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మంచిర్యాల మున్సిపాలిటీలో జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు అధికారులకే సవాల్గా నిలుస్తున్నాయి. కాగజ్నగర్, బెల్లంపల్లి మున్సిపాల్టీలతోపాటు నూతనంగా ఏర్పడిన ఖానాపూర్, నస్పూర్, క్యాతన్పల్లి, లక్షెట్టిపేటలో స్థిరాస్తి వ్యాపారం కోట్లాది రూపాయల్లో సాగుతోంది. అక్రమ లేవుట్లు, ఆక్రమణలను ఎలా అరికట్టాలా అని ఎమ్మెల్యేలు తర్జనభర్జన పడుతున్నారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతోనైనా ఆక్రమణలకు అడ్డుకట్ట పడి.. పురపాలికలు అభివృద్ధి చెందాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పట్టణప్రగతి అమలు కోసం ఆదిలాబాద్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికే సన్నద్ధతమవుతున్నారు.
ఇవీ చూడండి: విలువలు, విశ్వసనీయతే మా బలం: ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి