ముఖ్యమంత్రి ఇచ్చిన వరం ఆదిలాబాద్ జిల్లాలో కొందరు కార్మికులకు అందలేదు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు ప్రోత్సాహకంగా సీఎం కేసీఆర్ రూ.5 వేలు అదనంగా చెల్లిస్తామని ప్రకటించారు. కిందటి నెలలో ఆదిలాబాద్ పురపాలక కార్మికులకు సైతం అందించారు. కానీ అధికారుల తప్పిదం కారణంగా కొందరు కార్మికులకు ఈ డబ్బులు ఖాతాల్లో జమ కాకపోవడం వల్ల వారు నిరుత్సాహానికి గురవుతున్నారు.
నిధులు అందని ద్రాక్షగా..
ఇక్కడి నుంచి కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను అధికారులు పంపించారు. కానీ హైదరాబాద్లో అధికారులు ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్ఈ కోడ్ను తప్పుగా నమోదు చేయడం వల్ల కార్మికులకు ప్రోత్సాహక నిధులు అందని ద్రాక్షగా మారాయి. ఆదిలాబాద్ పురపాలకం పరిధిలో 328 మంది కార్మికులు పనిచేస్తుండగా ఇందులో 85 మందికి ఈ ప్రోత్సాహక నిధులు అందలేదు. ఆ అంశంపై పురపాలక కమిషనర్ మారుతి ప్రసాద్ కార్మికుల బ్యాంకు ఖాతాల వివరాలను మరోసారి ప్రభుత్వానికి పంపించామని వివరించారు. ఈ విషయాన్ని పురపాలక సంచాలకుడికి దృష్టికి సైతం తీసుకెళ్లామని, త్వరలోనే కార్మికుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని చెబుతున్నారు.
ఇదీ చూడండి : వలస కూలీ దంపతులకు కరోనా పాజిటివ్!