పెన్గంగా మహారాష్ట్ర, తెలంగాణను విడదీస్తోంది. తెలంగాణ సరిహద్దు నుంచి 20 కిలో మీటర్లు వెళ్తే మహారాష్ట్ర గ్రామాల్లోకి అడుగుపెట్టవచ్చు. అయితే కొద్ది రోజులుగా ఆదిలాబాద్ సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర యావత్మల్ జిల్లాలో కొవిడ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రధానంగా ఆ జిల్లాలోని పాండ్రకవడా, వణి, యవత్మాల్ తాలూకాలో పరిస్థితి తీవ్రంగా ఉంది.
సోమవారం నుంచి అక్కడ పాఠశాలలను సైతం మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు పల్లెలకు పొంచి ఉన్న కరోనా ముప్పుపై ఆందోళన నెలకొంది. పెన్గంగా సరిహద్దున ఆదిలాబాద్లోని భీంపూర్, జైనథ్, బేల మండలాలు ఉన్నాయి.
తూతూ మంత్రంగా పరీక్షలు...
పెన్గంగా వంతెన మీదుగా మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు ప్రవేశించే డొల్లరా గ్రామం వద్ద కరోనా ప్రాథమిక నిర్ధరణ పరీక్షల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తూతూ మంత్రంగా పరీక్షలు చేస్తూ వదిలేస్తున్నారని విమర్శలున్నాయి. వారం రోజులుగా మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.... జిల్లా యంత్రాంగం పటిష్ఠ చర్యలు తీసుకోకపోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.
తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో కరోనా తీవ్రత పెరగకక ముందే మహారాష్ట్ర రాకపోకలపై నియంత్రణ పెట్టి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చూడండి: అక్కడ కరోనా కేసుల పెరుగుదల.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తం