వింబుల్డన్(Wimbledon) టోర్నీ మహిళల డబుల్స్ తొలి రౌండ్లో భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా(Sania Mirza) ద్వయం విజయ కేతనం ఎగురవేసింది. 6వ సీడ్ అలెక్సా - క్రాస్జిక్ జంటపై.. సానియా - బెతాని జోడీ 7-5, 6-3 తేడాతో విజయం సాధించింది.
ఈ గెలుపుతో సానియా - బెతాని జంట(Sania Bethanie) టోర్నీలోని రెండో రౌండ్లోకి ప్రవేశించింది. 2017 తర్వాత వింబుల్డన్ పోటీల్లో తలపడుతున్న సానియా మీర్జా అమెరికాకు చెందిన బెథానీ మాటెక్తో జతకట్టి.. మహిళల డబుల్స్లో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఇండో - అమెరికన్ ద్వయం.. తొలి రౌండ్లో విజయం సాధించి టోర్నీలో ముందుకు దూసుకెళ్లింది.
దేశం తరఫున నాలుగుసార్లు..
టోక్యోలో జరగనున్న విశ్వక్రీడాలతో భారత్ తరఫున నాలుగు ఒలింపిక్స్లలో పాల్గొన్న తొలి మహిళా అథ్లెట్గా నిలవనుంది టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. 2018లో ఇజాన్కు జన్మనిచ్చాక గతేడాది జనవరిలో హోబర్ట్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచి సెకండ్ ఇన్నింగ్స్ను ఘనంగా ప్రారంభించింది సానియా. ఈ వారమే జరిగిన ఈస్ట్బోర్న్ ఇంటర్నేషనల్ ఈవెంట్లో తొలి రౌండ్లోనే సానియా జోడీ నిష్క్రమించింది. ప్రస్తుతం నెల వ్యవధిలో జరగనున్న వింబుల్డన్, ఒలింపిక్స్లపై దృష్టి సారించింది. అందుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
"కోర్టు లోపల, బయట కఠోర సాధన చేస్తున్నా. చురుకుగా, శక్తిమంతంగా ఉండటానికి శ్రమిస్తున్నా. ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో అంకితా రైనాతో జతకట్టడం సంతోషంగా ఉంది. టాప్ 100లో ఉన్న భారత క్రీడాకారిణితో ఒలింపిక్స్కు వెళ్లడం ఇదే తొలిసారి" అని సానియా తెలిపింది.
ఇదీ చూడండి.. Wimbledon: మూడో రౌండ్లోకి ప్రవేశించిన జకోవిచ్