2008 బీజింగ్ ఒలింపిక్స్లో మణికట్టు గాయంతో తొలిరౌండ్లోనే తప్పుకోవడం వల్ల తీవ్రమైన కుంగుబాటుకు గురైనట్లు భారత టెన్నిస్ తార సానియా మీర్జా వెల్లడించింది. “2008 బీజింగ్ ఒలింపిక్స్లో తొలి రౌండ్లోనే తప్పుకోవాల్సి రావడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయా. కేవలం టెన్నిస్ అనే కాదు కోర్టు బయట విషయాల్లోనూ అది చాలా ప్రభావం చూపింది. చాలా సార్లు మన జీవితాల్లో ఆనందం కోసం కెరీర్పై అతిగా ఆధారపడతాం. ప్లేయర్లుగా కెరీర్ అనేది కేవలం జీవితంలో ఒక భాగమనే విషయాన్ని మర్చిపోతాం. నిజానికి అదే మన జీవితం కాదు. ప్రస్తుతం 34 ఏళ్ల వయసులో నేను స్పష్టమైన మానసిక దృక్పథంతో ఉన్నా. కానీ 20లో అలా కాదు. గతంలో అలా చేసి ఉండాల్సింది కాదనే విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఒలింపిక్స్లో తప్పుకోవడం గురించి ఎంతో ఆలోచించా. దాని కారణంగా మూణ్నాలుగు నెలలు కుంగుబాటుకు గురయ్యా. ఏ కారణం లేకున్నా ఏడ్చేదాన్ని. బాగానే ఉన్నానని అనిపించే లోపే కన్నీళ్లు వచ్చేవి" అని సానియా వెల్లడించింది.
"ఓ నెల రోజుల పాటు భోజనం చేసేందుకు కూడా నా గది దాటకపోవడం ఇంకా గుర్తుంది. నేనెంతో ప్రేమించే టెన్నిస్ను మళ్లీ ఆడలేనేమోననే బాధ కలిగింది. ఆ వయసులో.. నా పని అయిపోయింది, ఇక ఒలింపిక్స్లో పోటీపడలేననే వ్యాఖ్యలు చదువుతుంటే ఎలా ఉంటుంది? ఆ మణికట్టు గాయం కారణంగా కనీసం నా జుట్టు దువ్వుకోలేకపోయా. శస్త్రచికిత్స తర్వాత పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దీంతో నా కుటుంబాన్ని, దేశాన్ని నిరాశపరిచానని అనిపించింది. కానీ ఆ క్లిష్టమైన దశ నుంచి కోలుకోవడంలో నా కుటుంబం ఎంతో సాయం చేసింది. ఆ సమయంలో నాకు కావాల్సిన మనోస్థైర్యాన్ని వాళ్లు అందించారు. ఆ తర్వాత దేశంలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో రెండు పతకాలు గెలిచా” అని సానియా ఓ ఇంటర్వ్యూలో ఆ రోజులను గుర్తు చేసుకుంది. ఆ కుంగుబాటు నుంచి బయటపడ్డ సానియా దేశంలో అత్యుత్తమ టెన్నిస్ క్రీడాకారిణిగా ఎదిగింది. ఆసియా, కామన్వెల్త్, ఆఫ్రో- ఆసియా క్రీడల్లో కలిపి మొత్తం 14 పతకాలు గెలిచిన ఆమె, ఆరు గ్రాండ్స్లామ్ టైటిళ్లను ఖాతాలో వేసుకుంది.
ఇదీ చదవండి: శ్రీలంకతో సిరీస్.. టీమ్ఇండియా కెప్టెన్ ఎవరు?