జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ను మించిన వేగంతో పరుగెత్తి.. అందరి దృష్టిని ఆకర్షించిన శ్రీనివాస గౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్కు పంపించాలని పలువురు సూచిస్తున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా ఈ విషయాన్ని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు దృష్టికి తీసుకెళ్లారు.
"అతడి శరీర దారుఢ్యాన్ని ఒక్కసారి చూడండి. అథ్లెటిక్స్లో విజయాలు సాధించే అసాధారణ సామర్థ్యం అతడికి ఉంది. అందుకే అతడికి 100మీటర్ల స్ప్రింట్లో శిక్షణకు అవకాశం ఇవ్వాలి. కిరణ్ రిజిజు ఈ విషయంపై దృష్టిపెట్టాలి. కంబళ క్రీడను ఒలింపిక్లో చేర్చేలా ప్రయత్నాలూ చేయాలి. శ్రీనివాస్కు బంగారు పతకం కూడా ఇవ్వాలి"
-ఆనంద్ మహీంద్రా, ప్రముఖ పారిశ్రామికవేత్త.
శాయ్కి పిలిపిస్తాం...
మహీంద్రా ట్వీట్కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. శ్రీనివాస్కు శాయ్ నుంచి ఆహ్వానం పంపుతామని ఆయన స్పష్టం చేశారు.
"అథ్లెటిక్స్కు సంబంధించి ఒలింపిక్స్ ప్రమాణాలపై చాలా మందికి సరైన అవగాహన ఉండదు. శారీరక దృఢత్వం, ఓర్పు చాలా అవసరం. ట్రయల్స్ కోసం శ్రీనివాస గౌడను 'శాయ్' కోచ్ల వద్దకు పంపిస్తాం. దేశంలో ప్రతిభ కలిగిన వ్యక్తులను ఎప్పటికీ వదులుకోం".