మరో ఆరురోజుల్లో ఒలింపిక్స్(Tokyo Olympics) క్రీడా సంబరం మొదలవనున్న వేళ.. కరోనా వైరస్ కలకలం రేపింది. ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో తొలి కరోనా కేసు నిర్ధరణ అయ్యింది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రామంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలినట్లు టోక్యో నిర్వాహక కమిటీ ప్రతినిధి మాసా టకాయా శనివారం వెల్లడించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ వ్యక్తి పేరు, ఇతర వివరాలను బయటపెట్టలేదు.
ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ నిమిత్తం విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఒలింపిక్ గ్రామం నుంచి బయటకు తీసుకొచ్చి ఓ హోటల్లో ఐసోలేషన్లో ఉంచినట్లు మాసా టకాయా తెలిపారు. గ్రామంలో కరోనా వ్యాప్తి జరగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు.
కరోనా మహమ్మారి కారణంగా ఏడాది పాటు వాయిదా పడిన ఒలింపిక్స్ ఈ నెల 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 13న ఈ క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా దృష్ట్యా కఠిన నిబంధనల నడుమ ఒలింపిక్స్ను నిర్వహించనున్నారు. ఈ విశ్వక్రీడలకు దాదాపుగా 11వేల మంది, పారాలింపిక్స్కు 4,400 మంది క్రీడాకారులు రానున్నారు. పారాలింపిక్స్ ఆగస్టు 24 నుంచి మొదలవుతాయి. క్రీడాగ్రామంలోకి వస్తున్న అథ్లెట్లలో 80% మందికి వ్యాక్సినేషన్ జరిగిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
ఇదీ చూడండి: Olympics: అలాగైతే రెండు జట్లకూ స్వర్ణం